Reading Time: < 1 minute

ఆడిట్ కోసం పంచాయతీ రికార్డులు  బయటకు ఎలా ఇచ్చారు?:అడిషనల్ కలెక్టర్

Caption of Image.
  •     అడిషనల్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

కాగజ్ నగర్, వెలుగు: గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులను ఇష్టారీతిన ఖర్చు చేయడం ఏమిటి? ఒక్కో స్ట్రీట్ లైట్ రేటు ఏడాదికి రూ.350 పెరిగిందా? ఆడిట్ కోసం పంచాయతీ రికార్డులు ఎలా బయటకు ఇస్తారు? అంటూ ఆసిఫాబాద్​అడిషనల్ కలెక్టర్(లోకల్ బాడీ) యువరాజ్ మర్మాట్ పంచాయతీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం చింతల మానేపల్లి మండలం రవీంద్రనగర్-1 గ్రామపంచాయతీలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. పంచాయతీ రికార్డులు అందుబాటులో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆడిట్ పేరుతో రిజిస్టర్లను బయటకు ఎలా ఇచ్చారని కార్యదర్శిని నిలదీశారు.

ఆడిట్ వివరాలను వెంటనే సమర్పించాలని ఎంపీడీవో సత్యనారాయణను ఆదేశించారు. ఎన్నికల ఖర్చులకు జీపీ నిధుల నుంచి రూ.50 వేల వరకు చెల్లించడం, ప్రైవేట్ వ్యక్తి ఖాతాలో పంచాయతీ నిధులు జమ చేయడంపై మండిపడ్డారు. రూ.8.70 లక్షలు పంచాయతీ ఫండ్స్ వినియోగించినా ఎక్కడా పనులు కనిపించడం లేదంటూ నిలదీశారు. కార్యదర్శి, సర్పంచ్‌‌‌‌ను వివరణ కోరారు. సంబంధిత బిల్లులు, చెల్లింపు రిజిస్టర్లను స్వాధీనం చేసుకుని వెంట తీసుకెళ్లారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రి, స్కూల్, మార్కెట్, అంగన్‌‌‌‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. మార్కెట్‌‌‌‌లో పేరుకుపోయిన చెత్త, మెడికల్ వ్యర్థాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధ్యులపై నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.
 

©️ VIL Media Pvt Ltd.