Reading Time: < 1 minute
Wife Murder In Khammam Husband Kills Wife Allegedly For Insurance Money

Wife Murder: బీమా డబ్బుల కోసం ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేశాడు ఓ దుర్మార్గుడు. పైగా ఆమె ఆత్మహత్య చేసుకుందని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించింది. అంతకు ముందు నిందితుడు భార్యను విపరీతంగా చిత్రహింసలు పెడుతున్న దృశ్యాలు అందరినీ కలవరపెట్టాయి.

భార్యను చిత్రహింసలు పెట్టిన వ్యక్తి పేరు శివాజీ. 15 ఏళ్ల క్రితం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం గోల్ తండా‌కు చెందిన మీనాక్షిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరికీ ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. గోల్‌తండాలోనే దాదాపు 2 కోట్ల రూపాయలు వెచ్చించి ఇల్లు నిర్మించుకున్నారు. అందులో ఇంటి మీద రూ. 80 లక్షల వరకు రుణం ఉంది. అది కూడా మీనాక్షి పేరు మీదే ఉంది. విద్యుత్ స్తంభాల కాంట్రాక్ట్‌ను మీనాక్షి పేరు మీదే తీసుకుని పని చేస్తున్నాడు శివాజీ. బయటకు చూస్తే.. వారి సంసారం హాయిగా సాగిపోతోందని ఎవరైనా భావిస్తారు..

కానీ శివాజీకి ఉన్న చెడు అలవాట్ల కారణంగా.. వారి సంసారం ఆది నుంచే కలతలు రాజ్యమేలుతున్నాయి. శివాజీకి ఉన్న వివాహేతర బంధాల కారణంగా వారి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో భార్య పేరు మీద కోటి రూపాయలకు బీమా చేయించాడు శివాజీ. అప్పటి నుంచి ఆమెను మరింత టార్చర్ చేయడం మొదలు పెట్టాడు. నువ్వు చచ్చిపోతే.. ఇంటి మీద ఉన్న లోన్ రూ. 80 లక్షలు మాఫీ అవుతుందని చెప్పేవాడు. అంతే కాదు..కోటి రూపాయల బీమా కూడా తనకే వస్తుందని.. ఆ తతర్వాత తనకు నచ్చిన మహిళతో కాపురం పెడతానని వేధించేవాడు. ఈ విషయాలు పలుమార్లు పుట్టింటి వారికి చెప్పుకున్నా ఫలితం లేకపోయింది. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ చేసినా చక్కగా కాపురం చేస్తానని మాయమాటలు చెప్పి.. మళ్లీ అదే రకంగా బిహేవ్ చేసేవాడు శివాజీ..

ఇదే క్రమంలో భార్యను వదలించుకోవాలని డిసైడ్ అయిన శివాజీ.. భార్య మీనాక్షిని చంపేశాడు. ఉరేసుకుని చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ అతడి ప్రవర్తన.. తెలిసిన బంధువులు ఎవరూ నమ్మకపోవడంతో అడ్డంగా బుక్కయ్యాడు. మొత్తానికి బీమా డబ్బులు కోసమేనా? లేక హత్యకు మరో కారణమేదైనా ఉందా? కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.