Reading Time: 2 minutes
Tmc Internal Revolt Mamata Abhishek Banerjee Ipac West Bengal Election Loss

TMC Internal Crisis: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఎదురులేని శక్తిగా వెలుగొందుతున్న తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఇప్పుడు అస్తిత్వ సంక్షోభంలో కూరుకుపోయింది. 2021లో బీజేపీని 100 సీట్ల లోపు కట్టడి చేసిన మమతా బెనర్జీ, 2026 ఎన్నికల ఫలితాల్లో తానే 100 సీట్ల కంటే తక్కువకు పరిమితం కావాల్సి రావడం ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఓటమి మమతా బెనర్జీ మేనల్లుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్థాపించిన ‘ఐప్యాక్’ (I-PAC) సంస్థపై పడింది.

అభిషేక్ బెనర్జీయే టార్గెట్
ఎన్నికల ఫలితాల తర్వాత టీఎంసీ సీనియర్ నాయకులు బాహాటంగానే అభిషేక్ బెనర్జీ పనితీరును తప్పుబడుతున్నారు. మాజీ మంత్రి, సీనియర్ నేత కృష్ణేందు నారాయణ్ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. “పార్టీని నాశనం చేసిన ఏకైక వ్యక్తి అభిషేక్ బెనర్జీ. బెంగాల్ రాజకీయాలు కార్పొరేట్ ఆఫీసుల్లా నడవవు, కానీ ఆయన పార్టీని ఒక కంపెనీలా మార్చేశారు” అని మండిపడ్డారు. మమతా బెనర్జీని మహాభారతంలోని ‘ధృతరాష్ట్రుడి’తో పోలుస్తూ, క్షేత్రస్థాయి పరిస్థితులు తెలిసినా ఆమె పట్టించుకోలేదని విమర్శించారు. మరో సీనియర్ నేత అసిత్ మజుందార్ సైతం అహంకారం, అంతర్గత కుమ్ములాటలే పార్టీ పతనానికి కారణమని ధ్వజమెత్తారు.

‘ఐప్యాక్’ వల్లే కొంపమునిగిందా?
పార్టీ ఓటమికి 98 శాతం ఐప్యాక్ (I-PAC) కారణమని మాజీ ఎమ్మెల్యే ఖగేశ్వర్ రాయ్ ఆరోపించారు. టికెట్ల కేటాయింపులో ఐప్యాక్ ప్రతినిధులు డబ్బులు డిమాండ్ చేశారని, క్షేత్రస్థాయి కార్యకర్తల మనోభావాలను దెబ్బతీశారని విమర్శలు చేశారు. ఇదే సమయంలో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో టీఎంసీ శ్రేణుల్లో అశాంతి నెలకొంది. మమతా బెనర్జీ స్వయంగా ఓడిపోవడం, పార్టీపై ఈడీ (ED) దాడులు, సుప్రీంకోర్టులో నడుస్తున్న కేసుల నేపథ్యంలో ఆమె భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తమవుతోంది. రవీంద్రనాథ్ టాగోర్ జయంతి వేడుకల్లో మాట్లాడిన మమత, తానూ ఒక న్యాయవాదినేనని, బీజేపీపై ఇక బహిరంగంగా న్యాయ పోరాటం చేస్తానని ప్రకటించారు. ఈ సంక్షోభ పరిస్థితుల్లో పార్టీలో పలు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. సినీ దర్శకుడు, మాజీ ఎమ్మెల్యే రాజ్ చక్రవర్తి తాజాగా రాజకీయాల నుంచి విరమణ ప్రకటించారు. విపక్షంలో ఉన్న టీఎంసీని నడిపించే బాధ్యతను 80 ఏళ్ల అనుభవజ్ఞుడు శోవన్‌దేవ్ చటోపాధ్యాయకు (ప్రతిపక్ష నేత) అప్పగించారు. ఫిర్హాద్ హకీమ్ చీఫ్ విప్‌గా ఎన్నికయ్యారు. టీఎంసీ అధికారంలో ఉన్నప్పుడు కనిపించని లోపాలు, ఓటమి రాగానే బయటపడుతున్నాయని అంటున్నారు. ఇప్పుడు మమతా బెనర్జీ ముందున్న సవాలు కేవలం బీజేపీని ఎదుర్కోవడం మాత్రమే కాదు, తన సొంత గూటిలో రాజుకున్న అసమ్మతి జ్వాలలను చల్లార్చడం కూడా అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.