
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ రాజ్యాంగ సంక్షోభం వైపు పయణిస్తోంది. ఓడిపోయినప్పటికీ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సీఎంగా రాజీనామా చేయనని చెబుతోంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ పదవీకాలం ఈరోజు, మే 7వ తేదీతో ముగుస్తుంది. ఈరోజు అర్ధరాత్రి 12 గంటలలోపు మమతా బెనర్జీ రాజీనామా చేయకపోతే, మే 8వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుండి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు పశ్చిమ బెంగాల్ బాధ్యతలు ఎవరు తీసుకుంటారు? అనేది ప్రశ్నగా మారింది.
మరోవైపు, బెంగాల్లో బీజేపీ కొత్త ప్రభుత్వం మే 09న కొలువుదీరబోతోంది. ఈ రెండు రోజులు బెంగాల్లో పాలన ఎవరు చూసుకుంటారనే దానిపై ప్రజలకు సందేహాలు ఉన్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 172 ప్రకారం రాష్ట్ర శాసనసభ కాలపరిమితి 5 ఏళ్లు. ఈ కాలం పూర్తయిన తర్వాత అసెంబ్లీ ఆటోమెటిక్గా రద్దవుతుంది. దీనికి ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదు. గురువారం అర్ధరాత్రి 12 గంటలకు పాత శాసనసభ అంటే టీఎంసీ ప్రభుత్వం రద్దవుతుంది. దీంతో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ ఉండరు, వారి చట్టబద్ధమైన అధికారాలను కోల్పోతారు.
గవర్నర్ పాత్రే కీలకం:
రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం, ముఖ్యమంత్రి, అతడి మంత్రివర్గం గవర్నర్ అభీష్టం మేరకు మాత్రమే పదవిలో ఉంటారు. ఎన్నికల తర్వాత సీఎం మెజారిటీ కోల్పోతే, గవర్నర్ వారిని తొలగించి, మెజారిటీ పార్టీ నాయకుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించవచ్చు. అధికారం కోల్పోయిన సీఎం రాజీనామా చేయకుంటే, మంత్రివర్గాన్ని తొలగించే హక్కు గవర్నర్కు ఉంటుంది.
అయితే, 5 ఏళ్ల కాలపరిమితి ముగిసిన తర్వాత అసెంబ్లీ రద్దవుతుంది. తదుపరి ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం జరిగే వరకు మమతా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగే సంప్రదాయాన్ని కొనసాగించాలా? వద్దా.? అనే విషయాన్ని గవర్నర్ నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు గవర్నర్ ఆర్ఎన్ రవి తన విచక్షణాధికారాలు ఉపయోగిస్తారు. మమతను ఆపద్ధర్మ సీఎంగా ఉంచుతారా? లేక కొత్త ప్రభుత్వం ఏర్పాటు వరకు రాష్ట్రపతి పాలన విధిస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రపతి పాలన విధిస్తే, గవర్నర్ కొత్త ప్రభుత్వం ఏర్పాటు వరకు పాలనాబాధ్యతలు చూస్తారు.
ఎన్నికల సంఘం ప్రకారం, బెంగాల్ శాసనసభ పదవీకాలం 2021 మే 8న ప్రారంభమై మే 7న ముగుస్తుంది. దీని తర్వాత గవర్నర్ కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంటుంది. కొత్త ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేసి, కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ మమతా రాజీనామా చేయకుంటే భారత రాజకీయ చరిత్రలో ఇది ఒక కొత్త పరిణామంగా మిగిలిపోతుంది.