
పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ కంచుకోటగా భావించే భవానీపూర్ స్థానంలో భారతీయ జనతా పార్టీ (BJP) చారిత్రాత్మక విజయం సాధించడంతో, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఇన్స్టాగ్రామ్ వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భాన్ని ఒక కీలక పరివర్తనగా అభివర్ణించిన ఆయన, గతంలో మమతా బెనర్జీ ప్రభుత్వం తన పట్ల అనుసరించిన తీరును ఎండగట్టారు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ విడుదల సమయంలో బెంగాల్ ప్రభుత్వం తనను ఆ రాష్ట్రంలో ‘క్యాన్సిల్’ చేసిందని ఆయన ఆరోపించారు.
గత ఏడాది తన దర్శకత్వంలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ది బెంగాల్ ఫైల్స్’ చిత్రాన్ని పశ్చిమ బెంగాల్లో మమతా ప్రభుత్వం పూర్తిగా నిషేధించిందని వివేక్ గుర్తుచేశారు. ఆ సినిమా ట్రైలర్ లాంచ్ను అడ్డుకోవడమే కాకుండా, తనపై, చిత్ర బృందంపై దాడులు జరిగాయని, డజన్ల కొద్దీ ఎఫ్ఐఆర్ (FIR)లు నమోదు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 1990లలో జరిగిన కశ్మీరీ పండిట్ల పలాయనం నేపథ్యంలో తీసిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ను కూడా బెంగాల్ థియేటర్ల నుండి తొలగించారని ఆయన పేర్కొన్నారు.
తనను బెంగాల్ రాష్ట్రంలోకి అడుగుపెట్టనివ్వబోమని మమతా బెనర్జీ హెచ్చరించారని, కానీ తాజా ఎన్నికల ఫలితాలతో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ, ఇలాంటి పరిస్థితులు ‘మరోసారి పునరావృతం కాకూడదు’ (Never Again) అని వివేక్ అగ్నిహోత్రి ధీమా వ్యక్తం చేశారు.