July 15, 2026

PMJ Jewellers : PMJ దోపిడీ ట్విస్ట్.. మాస్టర్‌మైండ్ ఎవరు.?

PMJ Jewellers : PMJ దోపిడీ ట్విస్ట్.. మాస్టర్‌మైండ్ ఎవరు.?
Reading Time: < 1 minute
Pmj Jewellery Robbery Karimnagar Mastermind Shaboddin Case

PMJ Jewellers : కరీంనగర్ నగరంలోని పీఎంజే (PMJ) జ్యువెలరీ షోరూమ్‌లో జరిగిన భారీ దోపిడీ కేసులో పోలీసుల దర్యాప్తు అత్యంత వేగంగా కొనసాగుతోంది. ఈ కేసులో రోజుకో కొత్త మలుపు తిరుగుతూ సంచలన ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా దుండగుల కదలికలు , వారి నేపథ్యానికి సంబంధించిన కీలక విషయాలను పోలీసులు సేకరించారు.

దోపిడీకి పాల్పడిన ఐదుగురు దుండగులు పక్కా ప్లాన్‌తో వ్యవహరించినట్లు తెలుస్తోంది. వీరు జగిత్యాల జిల్లా ధర్మపురిలోని విజయలక్ష్మి లాడ్జ్‌లో మూడు రోజుల పాటు బస చేశారు. లాడ్జ్‌లోని సీసీ కెమెరాల్లో దుండగుల దృశ్యాలు స్పష్టంగా నమోదయ్యాయి. కరీంనగర్‌లో దోపిడీ ముగించుకున్న తర్వాత, దొంగలు మళ్లీ తిరిగి ధర్మపురి మీదుగానే పరారయ్యారు. ప్రస్తుతం ఎండల తీవ్రత వల్ల గోదావరి నది ప్రవాహం తక్కువగా ఉండటంతో, వారు తమ బైకును అక్కడే వదిలేసి నది దాటి పారిపోయినట్లు సమాచారం. అక్కడి నుండి మరో బైకుపై వారు ఎటువైపు వెళ్లి ఉంటారనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఈ దోపిడీ వెనుక మాస్టర్ మైండ్‌గా షాబొద్దీన్ అనే వ్యక్తిని పోలీసులు గుర్తించారు. ఇతనిపై గతంలోనే తీవ్రమైన నేర చరిత్ర ఉన్నట్లు వెల్లడైంది. గతంలో ముంబైలోని బోరివిల్లీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసులో నిందితుడిగా ఉన్న షాబొద్దీన్, పూణే జైలులో శిక్ష కూడా అనుభవించాడు. మహారాష్ట్ర పోలీసుల సమన్వయంతో ఇతని వివరాలను సేకరించిన తెలంగాణ పోలీసులు, అతనే ఈ ముఠాకు నాయకత్వం వహించినట్లు నిర్ధారించారు. ఇప్పటికే ఈ సమాచారంతో తెలంగాణ పోలీసుల బృందాలు మహారాష్ట్రకు చేరుకున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత సీరియస్‌గా తీసుకోవడంతో, పోలీస్ శాఖ దీనిని ఒక సవాల్‌గా భావిస్తోంది. నిందితులు ధర్మపురి గోదావరి దాటి, ఆదిలాబాద్ అడవుల గుండా మహారాష్ట్ర వైపు పారిపోయి ఉండవచ్చని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. ఈ గాలింపు చర్యల కోసం ఏకంగా 16 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సరిహద్దు రాష్ట్రాల పోలీసుల సహాయంతో నిందితులను అతి త్వరలోనే పట్టుకుంటామని పోలీస్ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.