July 14, 2026

Fish Price Down: యుద్ధం ఎఫెక్ట్.. భారీగా పడిపోయిన ట్యూనా ఫిష్ ధర..

Fish Price Down: యుద్ధం ఎఫెక్ట్.. భారీగా పడిపోయిన ట్యూనా ఫిష్ ధర..
Reading Time: < 1 minute
West Asia War Impact Tuna Fish Exports Visakhapatnam Losses

పశ్చిమాసియాలో ముసురుకున్న యుద్ధ మేఘాలు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత మత్స్యకారుల పాలిట శాపంగా మారాయి. అంతర్జాతీయ వాణిజ్య మార్గాల్లో నెలకొన్న అస్థిరత కారణంగా ట్యూనా (సూర) చేపల ఎగుమతులు నిలిచిపోయి, మత్స్య పరిశ్రమ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది.

కుప్పకూలిన ధరలు.. భారీగా నష్టాలు
గతంలో మార్కెట్లో కిలో రూ. 250 నుంచి రూ. 300 వరకు పలికే ట్యూనా ధర, ప్రస్తుతం రూ. 120కి పడిపోయింది. అంటే చేపల విలువ దాదాపు మూడో వంతుకు పడిపోవడంతో మత్స్యకారుల శ్రమ గంగపాలవుతోంది. విశాఖ తీరం నుంచి ఏటా సుమారు రూ. 2,000 కోట్ల ఎగుమతులు జరుగుతుండగా.. ప్రస్తుత పరిస్థితుల వల్ల దాదాపు రూ. 1,500 కోట్ల మేర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అంచనా.

యుద్ధం కారణంగా సముద్ర మార్గాల్లో రవాణా క్లిష్టంగా మారింది. బీమా సంస్థలు ‘వార్ రిస్క్ ప్రీమియం’ భారీగా పెంచడంతో, రవాణా ఖర్చులు 30 శాతం నుంచి 50 శాతం వరకు పెరిగాయి. ఈ పెరిగిన భారంతో ఎగుమతిదారులు ముందుకు రాకపోవడంతో నిల్వలు పేరుకుపోతున్నాయి.

మౌలిక సదుపాయాల లేమి..
విశాఖ, కాకినాడ ప్రాంతాల్లో దొరికే ట్యూనాను ప్రాసెస్ చేసే యూనిట్లు ఎక్కువగా కేరళలోనే ఉన్నాయి. స్థానికంగా అత్యాధునిక కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలు లేకపోవడం మత్స్యకారులకు శాపంగా మారింది. నిల్వ చేసుకునే అవకాశం లేక, వ్యాపారులు నిర్ణయించిన తక్కువ ధరకే చేపలను అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది.

ఆందోళనలో మత్స్యకారులు: ప్రస్తుతం ప్రభుత్వం విధించిన 61 రోజుల వేట నిషేధం జూన్ 14 వరకు కొనసాగుతుంది. ఒకవేళ ఆ లోపు అంతర్జాతీయ పరిస్థితులు చక్కబడకపోతే, వచ్చే సీజన్ మరింత గడ్డుగా మారుతుందని మత్స్యకార సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

డీజిల్ ధరల పెరుగుదల భయం, పడిపోతున్న ఎగుమతుల మధ్య మత్స్య పరిశ్రమను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. పశ్చిమాసియాలో శాంతి నెలకొంటే తప్ప, తీర ప్రాంత ఆర్థిక చక్రం మళ్లీ తిరిగేలా కనిపించడం లేదు.