
అమరావతి రాజధాని ప్రాంత రైతులు, ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా సీఆర్డీఏ (CRDA) కార్యాలయంలో త్రీ మ్యాన్ కమిటీ కీలక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొని అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
ఫీల్డ్ విజిట్లకు ప్రాధాన్యం..
అసెంబ్లీ సమావేశాలు , ఇతర అనివార్య కారణాల వల్ల త్రీ మ్యాన్ కమిటీ సమావేశం కొంత ఆలస్యమైనప్పటికీ, ఇకపై పనుల్లో వేగం పెంచాలని నిర్ణయించారు. రాజధాని గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి మంత్రి నారాయణతో పాటు సీఆర్డీఏ కమిషనర్, జాయింట్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని (ఫీల్డ్ విజిట్) ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రజల వద్దకే వెళ్లి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో ప్రధానంగా ఎన్ఎస్పీ (NSP) ప్రభావిత బాధితుల ఇళ్ల సమస్యలు, ఎఫ్ఎస్ఐ (FSI)కి సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. రాజధాని ప్రాంతంలోని గ్రామీణ రహదారుల మరమ్మతులు, మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కమిటీ తీర్మానించింది. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సీఆర్డీఏ కమిషనర్ విజయరామరాజు ఈ ప్రక్రియను వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషించనున్నారు.
రాజధాని పనులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, ప్రతి 2-3 వారాలకు ఒకసారి రెగ్యులర్ మీటింగ్లు నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. కేవలం చర్చలకే పరిమితం కాకుండా.. సమస్యల వారీగా సమీక్ష జరిపి, వాటి పరిష్కారంలో జరుగుతున్న పురోగతిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని అధికారులకు మంత్రి పెమ్మసాని స్పష్టం చేశారు. రాజధాని అభివృద్ధిలో రైతుల ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.