
Hyderabad Honeytrap: మహానగరంలో దిగ్భ్రాంతికరమైన హనీట్రాప్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా రిచ్ కిడ్స్ను టార్గెట్ చేస్తూ, మైనర్ బాలికలను ట్రాప్ చేస్తున్న ఇద్దరు అన్నదమ్ముల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా సీపీ సజ్జనార్ స్వయంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నిందితులను మూడు గంటల పాటు విచారించడం సంచలనంగా మారింది.
ఎవరీ నిందితులు..
గుంటూరుకు చెందిన అర్జున్ (అలియాస్ చంద్రశేఖర్ ఆజాద్), ప్రవీణ్ అనే అన్నదమ్ములు ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. వీరికి వీరి తల్లి మీనాకుమారి కూడా సహకరిస్తుండటం గమనార్హం. గతంలో కూడా అర్జున్ ఒక మైనర్ బాలికను ట్రాప్ చేసిన కేసులో జైలుకు వెళ్లి, కేవలం మూడు రోజుల్లోనే బయటకు వచ్చి మళ్లీ అదే వృత్తిని కొనసాగించాడు. నిందితుడు అర్జున్ ఇన్స్టాగ్రామ్లో ఎస్కార్ట్గా నటిస్తూ, ‘రొమాంటిక్ మూడ్’ అంటూ మైనర్లను ఆకర్షించేలా రీల్స్ చేసేవాడు. రిచ్ కిడ్స్ మాత్రమే వీరి టార్గెట్. అర్జున్ను ఇన్స్టాగ్రామ్లో సుమారు 150 మంది అమ్మాయిలు ఫాలో అవుతున్నారు. నిందితుడు ఖరీదైన కార్లు, విలాసవంతమైన షికార్ల పేరుతో మైనర్లకు వల వేసి హైదరాబాద్ రోడ్లపై తిప్పేవారు.
లైంగిక వేధింపులు – బ్లాక్ మెయిలింగ్
కేవలం తిప్పడమే కాకుండా, ఖరీదైన కార్లలోనే బాలికలపై లైంగిక దాడికి పాల్పడేవారు. ఆ దృశ్యాలను రహస్యంగా వీడియోలు తీసి, వాటిని చూపించి బ్లాక్ మెయిలింగ్ స్టార్ట్ చేసేవాడు. “మేము కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం, పెట్టుబడి కావాలి” అని నమ్మించి లేదా బెదిరించి డబ్బులు వసూలు చేసేవారు. ఈ క్రమంలోనే ఒక మైనర్ బాలిక ఇంట్లో ఎవరికీ తెలియకుండా రూ.13 లక్షలు వీరికి ఇచ్చినట్లు విచారణలో తేలింది. పోలీసుల కస్టడీలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఇప్పటివరకు సుమారు 19 మంది మైనర్ బాలికలను ఈ అన్నదమ్ములు ట్రాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అర్జున్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ను పోలీసులు లాక్ చేశారు. నిందితుల తల్లి మీనాకుమారికి కూడా ఈ వ్యవహారంలో సంబంధం ఉన్నట్లు తేలడంతో ఆమె పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.