Reading Time: < 1 minute
Drishyam 3 In Trouble Delhi High Court Issues Stay Order Over Ott Deal Dispute

మలయాళ వెండితెరపై సంచలనం సృష్టించిన ‘దృశ్యం’ సిరీస్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా వచ్చిన ఈ సిరీస్ సంచలనాలు సృష్టించింది.  ఇప్పుడు ఈ సిరీస్‌లో మూడవ భాగం ‘దృశ్యం 3’ కోసం ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే  ఈ సినిమా విడుదలకు ముందే చట్టపరమైన చిక్కుల్లో పడటం ఇప్పుడు కేరళ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

ఈ సినిమాను నిర్మిస్తున్న ఆశీర్వాద్ సినిమాస్ సంస్థ గతంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్‌తో కుదుర్చుకున్న డిజిటల్ డీల్‌ను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమెజాన్ ప్రైమ్ సంస్థ ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు, డిజిటల్ సంస్థకు అనుకూలంగా కీలక తీర్పునిచ్చింది. మే 15వ తేదీ వరకు ‘దృశ్యం 3’ సినిమాకు సంబంధించి ఎలాంటి కొత్త డీల్స్ OTT లేదా ఇతర డిజిటల్ హక్కులు కుదుర్చుకోకూడదని నిర్మాతలకు స్టే ఆర్డర్ జారీ చేసింది. ఈ అనూహ్య పరిణామంతో చిత్ర యూనిట్ డైలమాలో పడింది. వాస్తవానికి ఈ చిత్రాన్ని మే 21న విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. అయితే కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిన నేపథ్యంలో  సమస్య త్వరగా కొలిక్కి రాకపోతే మే 21న సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అటు మోహన్ లాల్ అభిమానులు మాత్రం ఈ వివాదం త్వరగా పరిష్కారం కావాలని కోరుకుంటున్నారు.