Reading Time: < 1 minute
Ap Government Increases Wages For Water Resources Lashkars

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సాగునీటి వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న సిబ్బందికి చంద్రబాబు ప్రభుత్వం తీపి కబురు అందించింది. జలవనరుల శాఖలో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న ‘లస్కర్ల’ దశాబ్దాల కష్టాన్ని గుర్తించి.. వారి రోజువారీ వేతనాన్ని భారీగా పెంచుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో వీరికి అందుతున్న అరకొర వేతనాల స్థానంలో.. గౌరవప్రదమైన జీతభత్యాలను కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

జీతాల పెంపు వివరాలు..
ప్రస్తుతం జారీ చేసిన జీవో ప్రకారం..  ఇప్పటివరకు లస్కర్లకు చెల్లిస్తున్న రోజువారీ వేతనం రూ.350 నుంచి రూ.550కి పెరిగింది. అంటే ప్రతి రోజూ రూ.200 అదనంగా లబ్ధి చేకూరనుంది. నెలకు సగటున లెక్కగడితే.. ఒక్కో కార్మికుడికి సుమారు రూ.6,000 వరకు అదనపు వేతనం లభిస్తుంది. పెరిగిన జీవన ప్రమాణాలు, నిత్యావసర ధరలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ సానుకూల నిర్ణయం తీసుకుంది.

Also Read:నిరుద్యోగులకు నెలకు రూ.1500.. పది పాసై ఉద్యోగం లేని వారికి మాత్రమే.. సీఎం ప్రకటన..

వ్యవసాయ రంగమే వెన్నెముకగా ఉన్న రాష్ట్రంలో.. సాగునీటి పంపిణీ వ్యవస్థను కంటికి రెప్పలా కాపాడేది లస్కర్లే. వీరు సాగునీటి కాలువలు, తూముల ద్వారా పొలాలకు సక్రమంగా నీటిని విడుదల చేయడం.. షట్టర్ల మూసివేత, ఓపెనింగ్ మరియు గేట్ల నిర్వహణను పర్యవేక్షించడం.. కాలువల గట్టుల పటిష్టతను చూడటం, ప్రమాదకరమైన లీకేజీలను గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టడం.. ఆఖరి ఆయకట్టు రైతు వరకు నీరు అందేలా నిరంతరం పహారా కాయడం వంటి పనులు చేస్తుంటారు.

Also Read:Mutual Funds: మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు భారీ శుభవార్త.. కొత్త రూల్ తీసుకొచ్చిన సెబీ..

చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ వేతన పెంపు డిమాండ్‌ను పరిష్కరించడం ద్వారా.. క్షేత్రస్థాయిలో పని చేసే కార్మికుల్లో మనోధైర్యం పెరగనుంది. ముఖ్యంగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వల్ల వేలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా కలగడమే కాకుండా.. సాగునీటి పంపిణీ వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.