నేటి ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది సూర్యరశ్మికి పూర్తిగా దూరమవుతున్నారు. రోజంతా ఇళ్లు, ఆఫీసులకే పరిమితం కావడం వల్ల శరీరానికి సహజమైన ఎండ తగలక విటమిన్ ‘డి’ లోపంతో బాధపడుతున్నారు. దీనికోసం చాలామంది విటమిన్ డి మాత్రలు, సప్లిమెంట్లను ఆశ్రయిస్తున్నారు. అయితే కృత్రిమ మాత్రల కంటే ప్రకృతి ప్రసాదించిన సూర్యకాంతే ఎంతో మేలని నిపుణులు చెబుతున్నారు. అసలు ఎండ వల్ల కలిగే ఉపయోగాలు, సప్లిమెంట్లు ఎప్పుడు వాడాలో ఇప్పుడు చూద్దాం.
సహజసిద్ధమైన విటమిన్ డి: ఉదయం పూట పడే లేత ఎండ మన చర్మంపై పడినప్పుడు శరీరం స్వయంగా విటమిన్ డి3ని తయారు చేసుకుంటుంది. ఇక ఇది ఎముకలను దృఢంగా ఉంచడమే కాకుండా, శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రోజుకు కాసేపు ఎండలో గడపడం వల్ల శరీరానికి కావలసిన విటమిన్ డి ఉచితంగా, సహజంగా లభిస్తుంది.

రక్తపోటు నియంత్రణ, మంచి నిద్ర: సూర్యరశ్మి కేవలం విటమిన్ డి మాత్రమే కాక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఎండ తగలడం వల్ల శరీరంలో ‘నైట్రిక్ ఆక్సైడ్’ విడుదలై రక్తనాళాలు రిలాక్స్ అవుతాయి. ఇక దీనివల్ల రక్తపోటు (BP) అదుపులో ఉంటుంది. అలాగే మెదడులో ‘సెరోటోనిన్’ అనే హార్మోన్ విడుదల పెరిగి రోజంతా ఉల్లాసంగా ఉండటంతో పాటు రాత్రికి మంచి నిద్ర పడుతుంది.
మాత్రలు ఎప్పుడు అవసరం?: ఎండ ద్వారా విటమిన్ డి అసలు అందనప్పుడు లేదా తీవ్రమైన లోపం ఉన్నప్పుడు మాత్రమే వైద్యుల సలహాతో మాత్రలు వాడాల్సి వస్తుంది. ఇక నిరంతరం ఇంట్లోనే ఉండే వారికి, వయోభారంతో బయటకు రాలేని వృద్ధులకు సప్లిమెంట్లు అవసరం అవుతాయి.
ఇక ఆరోగ్యం కోసం సప్లిమెంట్లపై ఆధారపడే కంటే రోజూ ఉదయాన్నే కొద్దిసేపు సూర్యరశ్మిలో గడపడం ఎంతో శ్రేయస్కరం. కాబట్టి రోజువారీ బిజీ లైఫ్లో కాస్త సమయం కేటాయించి, సహజసిద్ధమైన ఎండను ఆస్వాదిస్తూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి!
గమనిక: ఇది కేవలం మీ అవగాహన కోసం అందించిన సాధారణ సమాచారం మాత్రమే. మీకు తీవ్రమైన విటమిన్ డి లోపం లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే సొంతంగా మాత్రలు వాడకుండా తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి.
The post మాత్రల కంటే సూర్యరశ్మే బెస్ట్.. విటమిన్ D కోసం నిపుణుల కీలక సూచనలు! appeared first on Manalokam – Latest Telugu News & Updates.