Reading Time: < 1 minute
Hyderabad Golden Bonam To Kanaka Durga Temple Today

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో నేడు ఆధ్యాత్మిక సందడి నెలకొంది. తెలంగాణలోని హైదరాబాద్ నుంచి సంప్రదాయబద్ధంగా తీసుకొచ్చే బంగారు బోనాన్ని అమ్మవారికి సమర్పించనున్నారు. భాగ్యనగర్ శ్రీ మహంకాళీ జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గత 16 ఏళ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీలో భాగంగా తెలంగాణ భక్తులు ప్రతి ఏడాది కనకదుర్గమ్మకు బోనాలు సమర్పిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు.

ఉదయం 11 గంటల నుంచి 11.30 గంటల మధ్య విజయవాడ బ్రాహ్మణవీధి జమ్మిదొడ్డి వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం బోనాల బృందం భారీ ఊరేగింపుగా ఇంద్రకీలాద్రి వైపు బయలుదేరనుంది. మధ్యాహ్నం 1.30 నుంచి 2 గంటల మధ్య చిన రాజగోపురం వద్దకు చేరుకుని, అక్కడి నుంచి బోనాల ఊరేగింపు ప్రారంభమవుతుంది. ఈ ఊరేగింపు రెండు గంటలకు పైగా కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు. ఆషాఢ మాస ఉత్సవాల నేపథ్యంలో తెలంగాణ నుంచి భారీ సంఖ్యలో భక్తులు బోనాలు, సారె సమర్పించేందుకు వస్తుండటంతో ఆలయంలో రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉందని దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రోటోకాల్, వీఐపీ దర్శనాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో వి.కె. శీనా నాయక్ ప్రకటించారు.

గత ఆదివారం ఒక్కరోజే 85 వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకోవడంతో ఆలయంలో తీవ్ర రద్దీ నెలకొంది. అదే పరిస్థితి నేడు కూడా ఉండే అవకాశం ఉన్నందున భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఘాట్ రోడ్ వైపు ప్రైవేట్ వాహనాల రాకపోకలను నియంత్రించడంతో పాటు దేవస్థానం బస్సులను పూర్తిస్థాయిలో నడపనున్నట్లు అధికారులు తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, చంటి పిల్లలతో వచ్చే తల్లులు రద్దీ తక్కువగా ఉండే సమయాల్లో దర్శనానికి రావాలని దేవస్థానం విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా ఉదయం 8 గంటలలోపు లేదా మధ్యాహ్నం 3 గంటల తర్వాత సాయంత్రం 5 గంటల మధ్య ఆలయానికి వస్తే సులభంగా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందని సూచించింది. భక్తులంతా దేవస్థానం అధికారులకు సహకరించి, క్రమశిక్షణతో దర్శనాలు నిర్వహించుకోవాలని ఆలయ ఈవో కోరారు.