Reading Time: 2 minutes
Ap Monsoon Prediction 2026 Rainfall Breaks Likely Key Advisory Issued For Farmers

Monsoon Breaks Expected in AP: ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తుండగా.. ఈ ఏడాది వర్షపాతం పరిస్థితులపై విపత్తుల నిర్వహణ సంస్థ కీలక అంచనాలు వెల్లడించింది. సాధారణంగా నమోదయ్యే వర్షపాతంతో పోలిస్తే.. ఈసారి కొంత తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రకర్ జైన్ తెలిపారు. అయితే స్థానిక వాతావరణ మార్పుల ప్రభావంతో కురిసే వర్షాలు ఈ లోటును కొంత మేర భర్తీ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ప్రయాణంలో తరచూ విరామాలు ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అంటే కొన్ని రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురవనుండగా.. మరికొన్ని రోజులు పూర్తిగా పొడి వాతావరణం నెలకొనే పరిస్థితులు కనిపించవచ్చు. మారుతున్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు తమ పంటల ప్రణాళికలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచించారు.

విపత్తుల నిర్వహణ సంస్థ అంచనాల ప్రకారం.. పోలవరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే కర్నూలు, నంద్యాల, మార్కాపురం, అనంతపురం, వైఎస్సార్ కడప, నెల్లూరు జిల్లాల్లో కూడా వర్షాలు సాధారణ స్థాయి కంటే తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కూడా వర్షపాతం లోటు ఉండే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. ఈ జిల్లాల రైతులు సాగు ప్రణాళికల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మరోవైపు ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ జిల్లాల్లో వ్యవసాయానికి అనుకూల పరిస్థితులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో సాధారణ స్థాయి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో కూడా సాధారణ వర్షపాతం కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.

రుతుపవనాల గమనంలో మార్పులు, తక్కువ వర్షాల నేపథ్యంలో రైతులు వాతావరణ అంచనాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ.. పంటల ఎంపిక, విత్తనాల విత్తకం, నీటి వినియోగం వంటి అంశాల్లో ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈ ఏడాది వర్షాల తీరు వ్యవసాయ రంగంపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.