Reading Time: 2 minutes
Us Iran Talks Strait Of Hormuz Reopening Deal Global Oil Supply

హార్ముజ్ జలసంధిపై నెలకున్న దిగ్బంధం వీడిపోనుందా? తిరిగి నార్మల్ స్థితికి రాబోతుందా? వాణిజ్య నౌకల రాకపోకలకు లైన్‌క్లియర్ కాబోతుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా రెండు నెలలుగా హార్ముజ్ జలసంధి దిగ్బంధానికి గురైంది. దీంతో చమురు, గ్యాస్ సరఫరా నిలిచిపోయాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు, గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. పలు దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షోభానికి గురయ్యాయి. ప్రస్తుతం ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ హార్ముజ్ జలసంధి మాత్రం ఓపెన్ కాలేదు. తాజాగా గుడ్‌న్యూస్ అందుతోంది.

హార్ముజ్ జలసంధి పున:ప్రారంభంపై అమెరికా-ఇరాన్ ఒప్పందం కుదిరినట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని క్రమంగా సడలించడం.. దానికి ప్రతిగా ఇరాన్ హార్ముజ్ జలసంధిని దశలవారీగా తిరిగి తెరవడంపై ఇరు దేశాలు అవగాహనకు వచ్చినట్లు సమాచారం. అల్ అరేబియా కథనం ప్రకారం.. ఇరాన్-అమెరికా మధ్య ప్రాథమిక ఒప్పందం కుదిరిందని పేర్కొంది. ‘‘దిగ్బంధనాన్ని సడలించేందుకు.. హార్ముజ్ జలసంధిని క్రమంగా తెరవడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. వచ్చే కొన్ని గంటల్లోనే నిలిచిపోయిన నౌకలను విడుదల చేసే అవకాశం ఉంది.’’ అని అల్ అరేబియా వర్గాలు తెలిపాయి.

ఇక ఇదే అంశంపై ట్రంప్ స్పందిస్తూ.. ఇరాన్‌తో చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని.. త్వరలోనే యుద్ధం కూడా ముగిసే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంతో అమెరికా ప్రతిపాదించిన 14 అంశాల అవగాహన ఒప్పందాన్ని ఇరాన్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఘర్షణలకు ముగింపు పలికేందుకు అమెరికా-ఇరాన్ మధ్య ఒక పేజీ ఒప్పందం దాదాపు ఖరారైనట్లు రాయిటర్స్ కూడా వెల్లడించింది.

అక్సియోస్ నివేదిక ప్రకారం.. రెండు దేశాల ఒప్పందంలో భాగంగా ఇరాన్ అణు ఇంధన సంపద (న్యూక్లియర్ ఎన్‌రిచ్‌మెంట్)పై తాత్కాలిక నిషేధానికి అంగీకరించే అవకాశం ఉంది. దీనికి ప్రతిగా అమెరికా ఆంక్షలను సడలించడం, ఇరాన్‌కు చెందిన బిలియన్ల డాలర్ల ఫ్రీజ్ చేసిన నిధులను విడుదల చేయడం వంటి అంశాలు ఉండొచ్చని తెలుస్తోంది.

ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సహా కీలక నేతలంతా హతమయ్యారు. దీంతో ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసేసింది. దీంతో ఆయా దేశాలకు చెందిన చమురు, గ్యాస్ ట్యాంకర్లు నిలిచిపోయాయి. దీంతో ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. ఇక రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే హార్ముజ్ సమస్య తీరలేదు. తాజా చర్చలతో ఆ సమస్య కూడా తీరిపోయినట్లే. ఇక యథావిధిగా నౌకలు ప్రయాణం చేయడానికి మార్గం సుగమం అయింది.