
Love Marraige: ప్రేమ గుడ్డిది, కులం, మతం , ప్రాంతం అనే భేదాలు లేకుండా ఎవరికైనా ఎప్పుడైనా కలిగొచ్చు. పేద, ధనిక తేడాలను చూడదు. మధ్యప్రదేశ్లో జరిగిన ఒక సంఘటనను చూస్తే ఇదంతా నిజం అనిపిస్తుంది. సత్నా జైలులో జరిగిన సంఘటన ఆ రాష్ట్రంలో సంచలనంగా మారింది. అసిస్టెంట్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న మహిళా అధికారి, జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీని వివాహం చేసుకుంది. ఈ జైలర్, ఖైదీ ప్రేమ కథ ఇప్పుడు వైరల్గా మారింది.
Read Also: Mamata Banerjee: మమతా బెనర్జీ రాజీనామా చేయకుంటే ఎలా.? వచ్చే 2 రోజులు బెంగాల్ను ఎవరు పాలిస్తారు.?
జైలు అసిస్టెంట్ సూపరింటెండెంట్ అయిన ఫిరోజా ఖతూన్, వారెంట్ ఇన్చార్జ్గా పనిచేస్తున్నప్పుడు ధర్మేంద్ర సింగ్ అనే ఖైదీని కలిశారు. ఛతర్పూర్ జిల్లాలోని చాండ్లా నివాసి అయిన ధర్మేంద్ర సింగ్, 2007లో ఒక కౌన్సిలర్ను హత్య చేసి, పూడ్చిపెట్టిన కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. జైలులో ఉన్న సమయంలో ధర్మేంద్ర వారెంట్ సంబంధిత పనుల్ని ఫిరోజా చూసే వారు. ఇలా ఇద్దరి మధ్య పరిచయం స్నేహంగా ఆ తర్వాత ప్రేమగా మారింది.
ఈ క్రమంలోనే వారిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తన 14 ఏళ్ల శిక్షాకాలం పూర్తి చేసుకున్న తర్వాత, సత్ర్పవర్తన కారణంగా ధర్మేంద్ర జైలు నుంచి విడుదలయ్యారు. ధర్మేంద్ర నాలుగేళ్ల క్రితం జైలు నుంచి విడుదలయ్యారు. మే 5న ఛతర్పూర్ జిల్లాలోని లవ్కష్ నగర్లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఫిరోజా ముస్లిం కుటుంబం నుంచి వచ్చింది. ఆమె కుటుంబం ఈ పెళ్లి పట్ల అసంతృప్తితో ఉండటంతో, ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. సత్నాలోని విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు రాజ్ బహదూర్ మిశ్రా తన భార్యతో కలిసి ఫిరోజాకు కన్యాదానం చేశారు. ఈ పెళ్లికి బజరంగ్ దళ్ సభ్యులు కూడా హాజరయ్యారు. సత్నా జైలు అధికారులు, సిబ్బంది, ఖైదీలు కూడా కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్పారు.