
ఏప్రిల్ పోయింది. మే వచ్చింది. కమర్షియల్ సిలిండర్ల ధరలు, మినీ సిలిండర్ల ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వం డొమెస్టిక్ సిలిండర్ల ధరలను పెంచకపోవడంతో సామాన్యులకు బిగ్ రిలీఫ్ దక్కింది. దేశంలో మొత్తంలో 33 కోట్ల మంది డొమెస్టిక్ సిలిండర్ వినియోగదారులు ఉన్నారు. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల (14.2 కేజీల) ధరలను యథాతథంగా ఉంచడంతో వాళ్లంతా హ్యాపీ.
పెట్రోల్, డీజిల్ ధరలలో కూడా ఎలాంటి మార్పులు చేయకపోవడంతో వాహనదారులు ప్రస్తుతానికైతే ప్రశాంతంగా ఉన్నారు. అంతర్జాతీయ ఇంధన ధరలు పెరిగినప్పటికీ, గృహ వినియోగదారులకు ఉపశమనం కల్పిస్తూ, మే నెలలో పెట్రోల్, డీజిల్, గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల రిటైల్ ధరలు యథాతథంగా ఉన్నాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసిఎల్) ఒక ప్రకటనలో తెలిపింది.
దేశవ్యాప్తంగా దాదాపు 33 కోట్ల మంది వినియోగదారులకు గృహ వినియోగ ఎల్పిజి సిలిండర్ల (14.2 కేజీల) ధరలను స్థిరంగా ఉంచారు. అలాగే, సాధారణ ప్రజల కోసం పెట్రోల్ మరియు డీజిల్ ధరలలో కూడా ఎటువంటి మార్పును ప్రకటించలేదు. ప్రపంచ ఇంధన మార్కెట్లలోని అస్థిరత ప్రభావం వినియోగదారులపై పడకుండా కాపాడటమే లక్ష్యమని ఐఓసీఎల్ చెప్పుకొచ్చింది. విమాన ఇంధనమైన.. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలు కూడా యథాతథంగా ఉన్నాయి. కానీ.. వాణిజ్య సిలిండర్ల ధరలను మాత్రం కేంద్రం భారీగా పెంచింది. ఒకేసారి.. 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరపై రూ. 993 పెరిగింది. దీంతో.. ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ల ధరలు రూ. 2,078.50 నుంచి రూ. 3,071.50కి పెరగ్గా, ముంబైలో రూ. 2,031 నుంచి రూ. 3,024కి చేరాయి.
కమర్షియల్ సిలిండర్పై ధరను ఒకేసారి దాదాపు వెయ్యి రూపాయల దాకా పెంచడంతో హోటల్స్, హాస్టళ్లపై తీవ్ర ప్రభావం పడింది. ఒక్క హైదరాబాద్లోనే నెలకు 6 నుంచి 6.5 లక్షల కమర్షియల్ సిలిండర్లు విక్రయాలు జరుగుతాయి. టీ స్టాల్లు నుంచి స్టార్ హోటళ్ల వరకు నెలకు 4 నుంచి 5.50 లక్షల సిలిండర్లకు అవసరం ఉంటుంది. ఇండస్ట్రీలకు మరో 1.50 లక్షలు అదనంగా డిమాండ్ ఉంది. ఈ మొత్తం కమర్షియల్ సేల్స్ విలువ నెలకు రూ.140 నుంచి రూ.150 కోట్లకు చేరుతుందని గ్యాస్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. రెండు రోజులుగా బల్క్ ట్యాంకర్ల సరఫరా ఆగిపోయింది.