Reading Time: < 1 minute
Telangana Lrs Fee Discount 25 Percent Layout Regularization Scheme 2026

తెలంగాణ రాష్ట్రంలో అనుమతి లేని మరియు అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ (Layout Regularization Scheme) కోసం ఎదురుచూస్తున్న సామాన్య ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పెండింగ్‌లో ఉన్న లేఅవుట్ల క్రమబద్ధీకరణను వేగవంతం చేసే ఉద్దేశంతో, ఎల్ఆర్ఎస్ ఫీజు మరియు ఇతర చార్జీలపై ఏకంగా 25 శాతం రాయితీని ప్రకటిస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్ర మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ (MA&UD) బుధవారం నాడు ఈ మేరకు జీఓ ఎంఎస్ నెం. 131ని విడుదల చేసింది. ఈ రాయితీ పథకం మే 1, 2026 నుంచి జూలై 31, 2026 వరకు మూడు నెలల పాటు అందుబాటులో ఉంటుంది. ఈ గడువు లోపు తమ ఎల్ఆర్ఎస్ చార్జీలను చెల్లించే దరఖాస్తుదారులకు మాత్రమే ఈ 25% డిస్కౌంట్ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న ఎల్ఆర్ఎస్ ప్రక్రియను పూర్తి చేయడంలో ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కల్పించడం. రాయితీ ప్రకటించడం ద్వారా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ ప్లాట్లను/లేఅవుట్లను రెగ్యులరైజ్ చేసుకుంటారని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ రెగ్యులరైజేషన్ ఆఫ్ అన్‌అప్రూవ్డ్ అండ్ ఇల్లీగల్ లేఅవుట్ రూల్స్-2020 కు సవరణలు చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఈ ఉత్తర్వులను జారీ చేస్తూ, తదుపరి చర్యలు తీసుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కమిషనర్, హెచ్ఎండిఏ (HMDA) మెట్రోపాలిటన్ కమిషనర్, మరియు పంచాయతీ రాజ్ కమిషనర్ సహా సంబంధిత అధికారులందరినీ ఆదేశించారు.

దశాబ్దాల కాలంగా పెండింగ్‌లో ఉన్న అక్రమ లేఅవుట్ల సమస్యకు ఈ రాయితీ ద్వారా పరిష్కారం లభిస్తుందని, తక్కువ ధరకే తమ భూములను చట్టబద్ధం చేసుకునే సువర్ణావకాశం ప్రజలకు దక్కిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.