Reading Time: < 1 minute
Karur Train Accident College Bus Hit By Goods Train Tamil Nadu

తమిళనాడులోని కరూర్‌ జిల్లాలో శనివారం సాయంత్రం ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. కరూర్‌ సమీపంలోని వెల్లియానై వద్ద ఒక ప్రైవేట్ కళాశాల బస్సును గూడ్స్ రైలు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారు. సుమారు 50 మంది విద్యార్థులతో వెళ్తున్న ఆ కళాశాల బస్సు, ఒక రైల్వే క్రాసింగ్ దాటే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ రైల్వే క్రాసింగ్ వద్ద ఎటువంటి సిగ్నల్ వ్యవస్థ లేదా గేట్లు లేకపోవడమే ఈ దుర్ఘటనకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇది సాధారణ రైల్వే లైన్ కాదని.. చెట్టినాడ్ సిమెంట్స్ సంస్థకు చెందిన ప్రైవేట్ రైల్వే లైన్ అని దక్షిణ రైల్వే అధికారులు వెల్లడించారు. వీరరాక్కియం – పాళయం మధ్య ఉన్న ఈ మార్గంలో సిమెంట్ క్లింకర్ రవాణా కోసం ఈ రైలును నడుపుతున్నారు. ఇక్కడ కొన్ని చోట్ల మానవ రహిత (అన్‌మ్యాన్డ్) లెవల్ క్రాసింగ్‌లు ఉన్నాయని వారు పేర్కొన్నారు.

Also Read:Best Income: నాడు ఎకరం రూ.15 వేలు.. నేడు నెలకు రూ.14.50 లక్షల ఆదాయం.. ఎలా అంటే..

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై.. గాయపడిన విద్యార్థులను వేగంగా కాపాడి దగ్గర్లోని ఆసుపత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. కరూర్‌ జిల్లా ఎస్పీ జోష్ తంగయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ప్రమాద విషయం తెలుసుకున్న కరూర్‌ ఎమ్మెల్యే వి. సెంథిల్ బాలాజీ, ఎంపీ జోతిమణి ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సహాయం గురించి ఆరా తీశారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.