Reading Time: 2 minutes
Off The Record About Jana Sena Cadre Dissatisfaction Grows In West Godavari Reserved Constituencies

Off The Record: 2024 ఎన్నికల్లో జనసేనకు వెన్నెముకగా నిలబడింది ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా. రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా ఈ జిల్లా నుంచి గ్లాస్‌ గుర్తు మీద ఆరుగురు ఎమ్మెల్యేలు గెలిచారు. అయితే… ఆ జోష్‌ ఇప్పుడు కనిపించడం లేదన్నది లేటెస్ట్‌ టాక్‌. ఈ విషయం గురించి వాళ్ళు వీళ్లు కాదు, సొంత పార్టీ కార్యకర్తలే గుసగుసలాడుకుంటున్నారట. ఎమ్మెల్యేలు తమ పనులు చక్కబెట్టుకునే దిశలో ప్రయాణిస్తుంటే… ఇన్ఛార్జ్‌లు సొంత లాభాలు తప్ప కార్యకర్తలను పట్టించుకోవడంలేదన్న విమర్శలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా రిజర్వుడు సెగ్మెంట్స్ చింతలపూడి, గోపాలపురంలో జనసేనకు మంచిపట్టు ఉన్నప్పటికీ సరైన రీతిలో క్యాడర్‌ను నడిపించే నాయకత్వం లేకపోవడం పెద్ద సమస్యగా మారిందట. ఎన్నికల తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న రిజర్వ్‌డ్‌ సెగ్మెంట్లలో జనసేన నాయకులకు సరైన గుర్తింపు ఇవ్వకపోవడం కూడా ఇందుకు ఓ కారణం అని చెప్పుకుంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో తూతూ మంత్రంగా ఒకరిద్దరు నాయకులకు ప్రాధాన్యత కల్పిస్తూ మమ అనిపిస్తున్నారట మిత్రపక్షం ఎమ్మెల్యేలు. సరే… వాళ్ళని వదిలేసి మనం సొంతగా ఎదిగేందుకు విస్తృత అవకాశాలున్నా…. పార్టీ ఇన్ఛార్జ్‌లు ఆ సంగతే పట్టించుకోవడం లేదంటూ గుర్రుగా ఉంది కేడర్‌. ఏడాదిన్నర కాలంలో ఇక్కడి ఎమ్మెల్యేలు ఆశించిన స్థాయిలో పనితీరు చూపించలేకపోయారన్న అభిప్రాయం పెరుగుతున్నా…. దాన్ని ఉపయోగించుకుని మనం ఎక్కువగా జనంలోకి వెళ్ళలేకపోతున్నామంటూ ఈ నియోజకవర్గాల్లో జనసేన ద్వితీయ శ్రేణి ఆవేదన వ్యక్తం చేస్తోంది.

వచ్చే ఎన్నికల్లో తమకు అవకాశం దక్కుతుందో లేదోనన్న అనుమానంతో…. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందామన్నట్టు ఇన్ఛార్జ్‌ పదవిని అడ్డుపెట్టుకుని సొంత పనులు చక్కబెట్టుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. కష్టమొచ్చిన కార్యకర్తలకు అండగా నిలబడే విషయంలో రిజర్వుడు సెగ్మెంట్స్‌ ఇన్చార్జ్‌లు పూర్తిగా విఫలమవుతున్నారన్నది జనసేన కేడర్‌ వాయిస్‌. పార్టీ కోసం కష్టపడి పని చేసే ఉద్దేశం ఉన్నా… పట్టించుకునే దిక్కు లేదన్నది వాళ్ళ అసంతృప్తి. గోపాలపురం నియోజకవర్గంలో కాపు సామాజికవర్గంతో పాటు జనసేన క్యాడర్ బలంగా ఉన్నప్పటికీ ఇన్చార్జ్ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారట. పైగా పార్టీ కార్యక్రమాల పేరుతో చేపట్టిన సేవా కార్యక్రమాలపై గతంలో తీవ్రస్థాయిలో విమర్శలు రావడం మైనస్‌ అయిందని అంటున్నారు. అందుకే గోపాలపురం జనసేనకు కొత్త ఇన్ఛార్జ్‌ను నియమించాలన్న డిమాండ్‌ పెరుగుతోంది. గత ఎన్నికల్లో మన కోటాకింద సీటు రానంత మాత్రాన ఈసారి కూడా అలాగే జరుగుతుందన్న గ్యారంటీ ఏంటి? మనం గట్టిగా పనిచేసి బలం పుంజుకుంటే… ఈసారి సీటు ఇవ్వక ఎక్కడికి పోతారంటూ నాయకత్వాన్ని ప్రశ్నిస్తోంది కేడర్‌. అటు చింతలపూడి సెగ్మెంట్‌లోనూ సేమ్‌ టు సేమ్‌. ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే ఉన్నా…గ్రూప్‌ వార్‌తో ఆ పార్టీ సతమతం అవుతోంది. ఈ పరిస్థితిని వాడుకుంటూ… మనం బలం పెంచుకుంటే… వచ్చే ఎన్నికల్లో సీటు డిమాండ్‌ చేయవచ్చన్నది గ్లాస్‌ కార్యకర్తల లెక్క. కానీ… నాయకత్వం మాత్రం ఆ దిశగా ఆలోచించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బలమున్న జిల్లాలో చే జేతులారా ఇమేజ్‌ను డ్యామేజ్‌ చేసుకుంటున్నామంటున్నారు జనసేన కార్యకర్తలు. ఆరు సీట్లు గెలిచాం, జిల్లాలో మనకి తిరుగు లేదనుకునే పార్టీ పెద్దలు ఇక్కడి రిజర్వు సీట్లపై దృష్టి పెడితే భవిష్యత్తులో ఇబ్బంది ఉండదనేది ఆయా నియోజకవర్గాల నేతల మాట. అధినాయకత్వం కేడర్‌ మొర వింటుందో లేక ఉన్న బలం చాలని సరిపెట్టుకుంటుందో చూడాలంటున్నారు పొలిటికల్‌ పరిశీలకులు.