Reading Time: < 1 minute
క్రికెట్ ఆడుతూ కుప్పకూలిన యువకుడు.. ఆస్పత్రికి తరలించే లోపుగానే..

అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. క్రికెట్ ఆడుతూ 22 ఏళ్ల యువకుడు కుప్ప కూలి మృతిచెందిన తీవ్ర కలకలం రేపింది. మండలంలోని పెద్దూరుకు చెందిన 22 ఏళ్ల తేజ తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడేందుకు గ్రౌండ్ కు వెళ్ళాడు. పాలెంపల్లి వెంగణపల్లి గ్రామాల మధ్యలో ఉన్న మైదానంలో పరిసర గ్రామాలకు చెందిన యువకులంతా కలిసి సరదాగా క్రికెట్ ఆడుతుండగా అక్కడికే తేజ తోపాటు అతని టీమ్ కూడా వెళ్ళింది. సంక్రాంతి సెలవులకు గ్రామానికి వచ్చిన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు. అందరితో పాటు సరదాగానే కలిసి ఆడుకుంటున్న తేజ అంతలోనే ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాడు. చికిత్స కోసం తేజను ఆస్పత్రికి తరలించారు.

అపాస్మరక స్థితిలో ఉన్న తేజను స్నేహితులు మదనపల్లి ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ, మార్గమధ్యంలోనే తేజ మృతి చెందినట్లు గుర్తించారు. ఇంటర్‌ వరకు చదవిన తేజ ఈ మధ్యనే ఫిట్స్ వచ్చి అనారోగ్యానికి గురైనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే క్రికెట్ ఆడుతూ మైదానంలోనే గుండెపోటుకు గురై కుప్పకూలినట్టుగా వైద్యులు నిర్ధారించారు. తేజ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

ఇదిలా ఉంటే, ఇటివల అల్లూరి జిల్లా దేవిపట్నం మండలంలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. మండలంలోని పరగసానిపాడు గ్రామంలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ లో విషాదం చోటుచేసుకుంది. రాజు అనే యువకుడు బ్యాటింగ్ చేసి అవుట్ అయిన తర్వాత, నీళ్లు తాగి విశ్రాంతి తీసుకుంటుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు అతన్ని గోకవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..