Reading Time: < 1 minute
Siddaramaiah Officially Announces Resignation Karnataka Cm Change

Siddaramaiah: కర్ణాటక రాజకీయాల్లో ఎట్టకేలకు ఒక సంచలన ముగింపు వచ్చేసింది. గత కొన్ని రోజులుగా సాగుతున్న లీడర్‌షిప్ మార్పు ఉత్కంఠకు తెరదించుతూ.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాల మేరకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేబినెట్ సహచరులకు స్పష్టం చేశారు. దీంతో రాష్ట్రంలో నాయకత్వ మార్పిడికి అధికారికంగా లైన్ క్లియర్ అయింది. గురువారం ఉదయం బెంగళూరులోని తన అధికారిక నివాసంలో సిద్ధరామయ్య మంత్రులకు ‘బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్’ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “హైకమాండ్ ఆదేశాల మేరకే నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను. నా తర్వాత తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది అధిష్ఠానమే నిర్ణయిస్తుంది. మనస్ఫూర్తిగా రాజీనామా చేస్తున్నా.. నాకు ఎలాంటి బాధ లేదు.. మీ అందరి సహకారానికి కృతజ్ఞతలు.. హైకమాండ్‌ నన్ను సీఎం పదవికి రాజీనామా చేయమని కోరింది” అని ప్రకటించారు. అంతేకాదు, పార్టీ ఎవరిని తదుపరి సీఎంగా ఎంపిక చేసినా.. వారికి తన పూర్తి సహకారం ఉంటుందని ఈ 77 ఏళ్ల సీనియర్ నేత హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్‌తో పాటు మంత్రివర్గ సహచరులందరూ పాల్గొన్నారు. ప్రస్తుతం సీఎం రేసులో శివకుమార్ పేరు ముందంజలో ఉంది. అయితే, సిద్ధరామయ్య రాజీనామా ప్రకటనతో సస్పెన్స్ ముగిసినప్పటికీ.. తదుపరి అధికారిక ప్రక్రియపై చిన్నపాటి అనిశ్చితి నెలకొంది. సిద్ధరామయ్య తన రాజీనామా లేఖను అధికారికంగా సమర్పించడానికి గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అపాయింట్‌మెంట్ కోరినట్లు సమాచారం వచ్చింది. కానీ, రాజ్ భవన్ వర్గాల ప్రకారం.. గవర్నర్ ప్రస్తుతం బెంగళూరులో లేరు. ఆయన కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు వెళ్లినట్లు తేలింది. చివరికి ఏం జరగనుందో నేడు తేలనుంది.