Reading Time: < 1 minute
ఎయిర్‌పోర్టులో షాకింగ్ ఘటన.. మానవ అస్థిపంజరం గుర్తింపు..ఉలిక్కిపడిన అధికారులు

దేశరాజధాని ఢిల్లీలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మానవ అస్థిపంజరం కలకలం సృష్టించింది. సాధారణ తనిఖీల్లో భాగంగా ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది బ్యాగ్‌లు చేస్తుండగా, ఒక బ్యాగులో అస్థిపంజరం ఉన్నట్లు గుర్తించారు. విమానాశ్రయంలోని టెర్మినల్ 3 వద్ద ఈ ఘటన చోటు చేసుకకుంది. భారీ భద్రతా, సెక్యూరిటీ ఉన్న విమానాశ్రయంలో ప్రయాణికుడి వద్ద అస్తిపంజరం కనిపించటంతో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందిన వెంటనే భద్రతా సంస్థలను అప్రమత్తం చేశారు. ఆ ప్రాంతంలో హై అలర్ట్‌ ప్రకటించారు. పోలీసులు, భద్రతా దళాలు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో టెర్మినల్‌ 3 నుంచి వెళ్తున్న ఒక మెడికల్‌ స్టూడెంట్‌ బ్యాగులో ఈ అస్థిపంజరం గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే, అది డెమో అస్థిపంజరమని, సాధారణంగా వీటిని మెడికల్‌ కాలేజీల్లో ఉపయోగిస్తారని చెప్పారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బ్యాగ్‌పై అతికించిన కంపెనీ లేబుల్‌లో అడ్రస్‌ కూడా ఉంది. దీని ఆధారంగా, పోలీసులు కంపెనీని సంప్రదించగా, అందులో ఉన్న వస్తువులు స్టూడెంట్స్ కోసం తయారు చేసిన నమూనాలుగా వారు నిర్ధారించారు. దీంతో అటు అధికారులు, సిబ్బంది అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ కేసులో ఎటువంటి నేరపూరిత కోణం కనిపించలేదని, అయినప్పటికీ అనుమానాలు తొలగించేందుకు గాను దానిని ఫోరెన్సిక్‌ పరీక్షకు పంపించామని పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి…