
హైదరాబాద్, వెలుగు: వెల్ఫేర్ శాఖలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని అధికారులను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆదేశించారు. బుధవారం ఆయన ఎస్సీ, ఎస్టీ గురుకులాలు, దివ్యాంగుల శాఖ ఉద్యోగుల బదిలీలపై చర్చించేందుకు సెక్రటేరియెట్ లో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ మాట్లాడుతూ.. దూర ప్రాంతాల్లో సుదీర్ఘకాలం సేవలందించిన ఉద్యోగులకు వారు కోరుకున్న ప్రాంతాల్లో పోస్టింగులు కల్పించాలని సూచించారు.
ఆరోగ్య సమస్యలు ఉన్న ఉద్యోగులు, దంపతులు ఒకే చోట పనిచేసే “స్పౌజ్ కేసులు” వంటి అంశాలను సానుకూలంగా పరిగణించాలని ఆదేశించారు. బదిలీలకు స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించి వాటిని ఉద్యోగులకు అందుబాటులో ఉంచాలన్నారు. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి వేగంగా స్పందించాలని చెప్పారు.