
ఏపీలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూములు, ఆస్తుల విషయంలో అనేక మార్పులు చేస్తోంది. ప్రజలు తమ ఆస్తులు భద్రంగా ఉంచేందుకు కార్డులను జారీ చేస్తోంది. ఇప్పటికే కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను జారీ చేయగా.. త్వరలో మరో కార్డు కూడా జారీ చేయనుంది. అదే ప్రాపర్టీ కార్డు. నక్ష సర్వేను తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. సర్వే పూర్తి చేసిన తర్వాత ప్రతీ ఇంటికి ప్రాపర్టీ కార్డును అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే ఈ నక్ష సర్వే ప్రారంభం కానుందని తెలుస్తోంది. గత ఏడాది ఈ సర్వే గడువు ముగియగా.. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తిరిగి తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది.
ప్రతీ ఆస్తికి ప్రాపర్టీ కార్డ్
నక్ష అనగా నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ అని అర్థం. ఈ సర్వే పూర్తి చేసి ఇళ్లు, ఆస్తులు, భూములకు ప్రాపర్టీ కార్డులు అందించనున్నారు. ప్రజలకు సంబంధించిన ఆస్తులను జీఐఎస్, డ్రోన్ల ఆధారంగా సర్వే చేస్తారు. అనంతరం ఆస్తులను గుర్తిస్తూ ప్రాపర్టీ కార్డులను జారీ చేస్తారు. 2027 మార్చిలోగా ఈ సర్వేను పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. ఈ ప్రాపర్టీ కార్డుపై ఉండే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ఆస్తుల వివరాలు అన్నీ వచ్చేస్తాయి. స్థలాలు, ఇళ్లు, భూములు, భవనాలు, విస్తీర్ణం లాంటి వివరాలు అన్నీ వచ్చేస్తాయి. బ్యాంకుల్లో రుణానికి ఆస్తుల డాక్యుమెంట్స్ అవసరం అయినప్పుడు ఇది సహాయపడుతుంది. అలాగే మీ భూములను సులువుగా గుర్తించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
కేంద్రంతో రాష్ట ప్రభుత్వం సంప్రదింపులు
ఇక ఆస్తులను మ్యూటేషన్, రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా ఈ కార్డుతో పని సులువవుతుంది. ఇక అధికారులకు కూడా ప్రజల ఆస్తులను గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. గత ఏడాది మార్చిలోనే ఈ సర్వే గడువు ముగిసింది. 2024లో నక్ష సర్వేను దేశవ్యాప్తంగా 152 నగరాలు, పట్టణాల్లో కేంద్రం ప్రారంభించింది. ఏపీలోని అనంతపురం, కుప్పం, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, గుంటూరు, ఏలూరు, కాకినాడ ప్రాంతాలను ఇందుకు ఎంపిక చేస్తారు. గత ప్రభుత్వం సర్వే పూర్తి చేసినా మ్యాపింగ్ చేపట్టలేదు. అలాతే రికార్డులను ఎంట్రీ చేయలేదు. ఈ క్రమంలో కేంద్రంతో మాట్లాడి సర్వేను తిరిగి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను జారీ చేసింది. వీటిని ఉచితంగా రైతులకు అందిస్తోంది.