Reading Time: 2 minutes
పశ్చిమ ఆసియా సంక్షోభంపై అప్రమత్తమైన కేంద్రం.. మంత్రుల సాధికార బృందం కీలక భేటీ

పశ్చిమ ఆసియాలో క్షీణిస్తున్న పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అనధికారిక మంత్రుల సాధికార బృందం (ఐజీఓఎం) తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితి, దాని ప్రభావం భారతదేశంపై ఎలా ఉండవచ్చనే దానిపై వివరంగా చర్చించారు. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, పెట్రోలియం సహజ వాయువుల మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఇంధన శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, రసాయనాలు ఎరువుల మంత్రి జె.పి. నడ్డా, వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పాల్గొన్నారు

దీర్ఘకాలిక సన్నద్ధతపై దృష్టి

పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా, భారతదేశం మధ్యకాలిక, దీర్ఘకాలిక సన్నద్ధతను అలవరచుకోవాల్సిన అవసరం ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. అన్ని మంత్రిత్వ శాఖలు అప్రమత్తంగా ఉండాలని, సమన్వయం పాటించాలని, త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు. ఏ పరిస్థితినైనా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, అన్ని విధానపరమైన ప్రయత్నాలను సమన్వయం చేసి, నిర్దిష్ట కాలపరిమితిలోగా అమలు చేయాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో, ఏడు కార్యదర్శుల సాధికార బృందాలు (EGoS) వివిధ రంగాలలోని పరిస్థితిని, తీసుకున్న చర్యలను సమర్పించాయి. ఇంధనం, సరఫరా గొలుసులు, ఆర్థిక ప్రభావం, భద్రతకు సంబంధించిన అంశాలపై చర్చించారు.

రాష్ట్ర, జిల్లా యంత్రాంగాలతో సమన్వయం

రాష్ట్ర, జిల్లా యంత్రాంగాలతో బలమైన సమన్వయం కొనసాగించడానికి ప్రాముఖ్యతను, ప్రజలకు కచ్చితమైన, సకాలంలో సమాచారాన్ని అందించాల్సిన అవసరం ఉందని అనధికారిక మంత్రుల బృందం భావించింది. వదంతులు, తప్పుడు సమాచారం, నకిలీ వార్తలను అరికట్టడంలో కచ్చితమైన సమాచారాన్ని పంచుకుంటూ చురుకైన పాత్ర పోషించాలని ప్రభుత్వం అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలను ఆదేశించింది. ఈ సమావేశం అనంతరం రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ఈ సంక్షోభం ఎలాంటి ప్రభావం నుంచైనా దేశ ప్రజలను కాపాడటానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. భారత ఆర్థిక, ఇంధన, భద్రతాపరమైన పరిణామాలను ఎదుర్కోవడానికి భారత్ సన్నద్ధమవుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..