సన్రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 202 పరుగుల భారీ లక్ష్యాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కేవలం 15.4 ఓవర్లలోనే ఛేదించి దిమ్మతిరిగే షాకిచ్చింది. బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో 200 పరుగులకు పైగా లక్ష్యాన్ని ఆర్సీబీ ఛేదించడం ఇది రెండోసారి మాత్రమే. గతంలో 2010లో పంజాబ్ జట్టుపై బెంగళూరు ఈ ఘనత సాధించింది. సుదీర్ఘమైన 16 ఏళ్ల నిరీక్షణ తర్వాత మళ్ళీ సొంత మైదానంలో ఇంతటి భారీ లక్ష్యాన్ని విజయవంతంగా అధిగమించి చరిత్ర సృష్టించింది.
ఈ విజయం కేవలం 16 ఏళ్ల నిరీక్షణను ముగించడమే కాకుండా, ఐపీఎల్ చరిత్రలోనే ఒక సరికొత్త మైలురాయిని నెలకొల్పింది. 200 కంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని అత్యంత వేగంగా ఛేదించిన జట్టుగా ఆర్సీబీ నిలిచింది. గతంలో 2025లో గుజరాత్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ 15.5 ఓవర్లలో ఈ ఘనత సాధించగా, ఇప్పుడు ఆర్సీబీ 15.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ముగించి ఆ రికార్డును తన పేరుతో రాసుకుంది.
ఈ చారిత్రాత్మక విజయానికి యువ ఆటగాడు దేవదత్ పడిక్కల్ పునాది వేశాడు. కేవలం 26 బంతుల్లోనే 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. మరోవైపు వెటరన్ స్టార్ విరాట్ కోహ్లీ తన క్లాస్ ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. 38 బంతుల్లో 69 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. వీరిద్దరి ధాటికి హైదరాబాద్ బౌలర్లు చేతులెత్తేశారు.
బ్యాటింగ్కు ముందు బౌలింగ్లోనూ ఆర్సీబీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఐపీఎల్ అరంగేట్రం చేసిన జాకబ్ డఫీ అద్భుత ప్రదర్శన చేశాడు. 4 ఓవర్లలో కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి వంటి కీలక వికెట్లను పడగొట్టాడు.
డఫీ స్పెల్ కారణంగానే హైదరాబాద్ జట్టు మరీ భారీ స్కోరు చేయకుండా అడ్డుకోగలిగారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన బెంగళూరు, 2026 సీజన్ను ఘనంగా ప్రారంభించింది. దీంతో మరోసారి ట్రోఫీ ఆర్సీబీ ఖాతాలోకి చేరుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇదే ఫాం కంటిన్యూ చేస్తే వరుసగా రెండోసారి ట్రోఫీని దక్కించుకునే అవకాశం ఉంది.




