Reading Time: < 1 minute
ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టు.. గంటలకొద్దీ రోడ్లపై చక్కర్లు కొట్టు.. పల్లెల్లో పెరిగిన కొత్త కల్చర్!

నగరాల్లోనే కాదు పల్లెల్లోనూ ఈవీ వెహికిల్స్ తెగ తిరిగేస్తున్నాయి..! అఫీషియల్‌గా ఆఫీసులకే కాదు.. పొలం పనులకు వెళ్లే రైతన్నకు నేస్తమయ్యాయి..! తక్కువ ఖర్చు.. ఎక్కువ ప్రయాణం.. అన్నింటికంటే ముఖ్యంగా జీరో పొల్యూషన్ కావడంతో కరీంనగర్‌ జిల్లాలోని పల్లెల్లో ఇప్పుడు ఎక్కువ ఎలక్ట్రికల్‌ స్కూటర్లే రోడ్డెక్కుతున్నాయి. పెట్రోల్ సమస్య అసలే లేదంటున్నారు ఈవీ వెహికల్‌ ఓనర్స్..! ఆయిల్ అయిపోతోందన్న ఆందోళన అవసరం లేదు. పెట్రోల్ బంకుల దగ్గర గంటల కొద్దీ వెయిట్‌ చేయాల్సిన పనిలేదు. ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టు.. గంటలకొద్దీ రోడ్లపై చక్కర్లు కొట్టు అన్నట్టు ఎలాంటి టెన్షన్‌ లేకుండా తిరిగేస్తున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా కరీంనగర్‌ జిల్లాలోనే ఎక్కువ ఎలక్ట్రికల్ వాహనాల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా పల్లెల్లో పొలం పని చేసుకునే రైతులు ఈవీ వెహికిల్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. సిటీకి వెళ్లి పెట్రోల్‌ కొట్టించాల్సిన పనిలేదు. ఒక్కసారి చార్జ్ చేస్తే 100 నుంచి 120 కిలోమీటర్లు తిరగొచ్చు.. అన్నింటికంటే ముఖ్యంగా ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అన్న ఆలోచనతో ఈవీలు కొంటున్నారు. తక్కువ ఖర్చు.. ఎక్కువ ప్రయాణం అన్న మౌత్ టాక్‌తోనూ దాదాపు జిల్లావ్యాప్తంగా ఉన్న పల్లెలన్నింట్లో ఎక్కువ ఇవే వాహనాలు దర్శనమిస్తున్నాయి.

పెరుగుతున్న పెట్రోల్‌ రేట్లకు ప్రత్యామ్నాయంగానూ ఈ ఈవీ వెహికిల్స్‌ని చూస్తున్నారు రైతులు. నెలకు పెట్రోల్‌కు పెట్టే ఖర్చులో పావలా వంతు కూడా కరెంట్ బిల్లు రావట్లేదని చెబుతున్నారు. ఒకే ఇంట్లో రెండు మూడు ఈవీ వెహికిల్స్ ఉంటున్నాయి. రైతులకు కాస్త సబ్సిడీ కూడా ఇస్తుండటంతో కొనుగోళ్లు అమాంతం పెరిగాయి.

మొత్తంగా… సిటీలోనే కాదు.. ఎలాంటి మార్కెటింగ్ అవసరం లేకుండా పల్లెల్లోనూ ఈవీ వాహనాల కొనుగోళ్లు పెరిగాయి. ఫ్యూచర్ ఈ ఎలక్ట్రిక్‌ వాహనాలతోనే అని గ్రహించిన రైతులు.. మరే ఆలోచన లేకుండా వాహనాలను కొనేస్తున్నారు. సిటీకి వెళ్లి పెట్రోల్ కొట్టించుకుని రావాల్సిన అవసరం లేకపోవడం… ఒక్కరోజు చార్జ్ చేస్తే నాలుగైదు రోజులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం సాగడం వల్ల కూడా ఈవీలకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..