
పార్వతీపురం మన్యం జిల్లాలో భారీ కింగ్ కోబ్రా హల్చల్ చేసింది. గుమ్మలక్ష్మీపురం మండలం వత్తాడ గ్రామంలో సుమారు 20 అడుగుల పొడవు ఉన్న కింగ్ కోబ్రా భీభత్సం సృష్టించింది. ఇక్కడ గిరిజనులు కొండవాలు ప్రాంతంలో పోడు భూమి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఈ గ్రామస్తులు ఎప్పటిలాగే ఉదయం వేళ పొలాలకు వెళ్లారు. ఆలా వెళ్లే క్రమంలో కొంతమంది రైతులు భారీ కింగ్ కోబ్రాను గమనించారు. సహజంగా పాములు రెండు అడుగులు లేదా మూడు అడుగులు ఉంటాయి. కానీ రైతులకు కనిపించిన కింగ్ కోబ్రా మాత్రం సుమారు ఇరవై అడుగులు ఉంది. ఆ పామును చూసిన రైతులకు ముచ్చెమటలు పట్టాయి. భయంతో అక్కడ నుంచి పరుగులు తీశారు. ఈ సమాచారం గ్రామమంతా వ్యాపించింది. కొద్ది సేపటికే పెద్ద సంఖ్యలో గ్రామస్తులు అక్కడికి చేరుకుని పరిస్థితిని గమనించసాగారు.
భారీ పాము కావడటంతో ఎప్పుడైనా దాడి చేసే ప్రమాదం ఉందనే భయంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందారు. ఈ పాము బ్రతికి ఉంటే ఇంట్లో పిల్లలు, పశువులు బయటకు వెళ్లే పరిస్థితి ఉండదు. ఎలాగైనా పామును హతమార్చాలని నిర్ణయించుకున్నారు. కానీ ఓ వైపు భయం మరో వైపు ఆత్మరక్షణ ఏమి చేయాలో పాలుపోలేదు. చేసేదిలేక కొంతసేపటికి ఒకింత ధైర్యం తెచ్చుకొని గ్రామస్తులు అంతా కలిసి ఆ కింగ్ కోబ్రాను హతమార్చారు. పాము మృతితో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ వన్యప్రేమికులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరుదైన వన్యప్రాణులను హతమారిస్తే పర్యావరణ సమతుల్యత కష్టతరం అవుతుందని ఆందోళన చెందుతున్నారు. పాములతో పాటు అరుదైన వన్యప్రాణులు కనిపిస్తే స్నేక్ క్యాచర్ కు కానీ అటవీ శాఖ సిబ్బందికి కానీ సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.
ఇటీవల కాలంలో వత్తాడ, పరిసర గ్రామాల్లో కింగ్ కోబ్రాలు తరచూ కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. అడవులు సమీపంలో ఉండటం, అలాగే పోడు వ్యవసాయం కోసం అడవిలోకి వెళ్లాల్సి రావడం వల్ల ఇలాంటి ప్రమాదాలు పెరుగుతున్నాయని వారు అంటున్నారు. పొలాలకు వెళ్లే సమయంలో ఎప్పుడు పాములు ఎదురవుతాయోనని రైతులు భయపడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు. గ్రామ పరిసరాల్లో సర్పాల సంచారాన్ని నియంత్రించే చర్యలు తీసుకోవాలని, ప్రజలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.