Reading Time: < 1 minute
Andhra Pradesh: అమరావతికి చట్టబద్ధత.. అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానం.. నెక్ట్స్ ఏంటంటే..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతికి రాజ్యాంగబద్ధమైన గుర్తింపునిచ్చే దిశగా ఏపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 5లో మార్పులు చేస్తూ, అమరావతిని ఏపీ ఏకైక రాజధానిగా చేర్చాలని కోరుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీఏకగ్రీవంగా ఆమోదించింది. అసెంబ్లీ ఆమోదించిన ఈ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం శనివారం రాత్రికే కేంద్రానికి పంపనుంది. దీనిపై కేంద్రం కూడా సానుకూలంగా స్పందిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రక్రియకు సంబంధించి రాబోయే కొద్ది రోజులు అత్యంత కీలకం. ఏప్రిల్ 1న కేంద్ర క్యాబినెట్ ఈ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఏప్రిల్ 2న పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టనుంది. పార్లమెంటు ఆమోదం పొందిన వెంటనే అమరావతిని అధికారిక రాజధానిగా పేర్కొంటూ కేంద్రం గెజిట్ విడుదల చేయనుంది.

అసెంబ్లీలో చంద్రబాబు ఉద్వేగభరిత ప్రసంగం

తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి ప్రాముఖ్యత, గత ఐదేళ్లలో జరిగిన పరిణామాలను గుర్తు చేసుకున్నారు. ‘‘అమరావతి అంటే కేవలం ఒక ప్రాంతం కాదు, అది శాతవాహనుల పాలన సాగిన చారిత్రక వారసత్వం. లండన్ మ్యూజియంలో కూడా అమరావతి గ్యాలరీ ఉండటం మనకు గర్వకారణం. ఉమ్మడి ఏపీలోనే విజయవాడను రాజధాని చేసి ఉంటే ఈరోజు అభివృద్ధి ఊహకందని స్థాయిలో ఉండేది’’ అని అన్నానరు.

సైబరాబాద్ స్ఫూర్తి

1996లో ఏమీ లేని చోట సైబరాబాద్‌ను నిర్మించినట్లే, అమరావతిని కూడా ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ సంకల్పమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధాని కోసం 29 వేల మంది రైతులు స్వచ్ఛందంగా 34 వేల ఎకరాల భూమిని ఇచ్చారని, ఇది ప్రపంచ చరిత్రలోనే అరుదైన విషయమని కొనియాడారు.2019లో అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి మాట మార్చి మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీశారని మండిపడ్డారు. అమరావతిని అడ్డుకునేందుకు చెరకు తోటలకు నిప్పు పెట్టించడం, ప్రపంచ బ్యాంక్‌కు లేఖలు రాయడం వంటి కుట్రలు చేశారని ఆరోపించారు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేసిన రోజునే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.