Reading Time: 2 minutes
Karimnagar Si Chandrasekhar Suicide Wife Divya Death Mystery

Karimnagar SI Chandrasekhar Suicide: కరీంనగర్ టూటౌన్ ఎస్సై చంద్రశేఖర్ ఆత్మహత్య సంచలనంగా మారింది. ఆయన భార్య దివ్య నాలుగు రోజుల క్రితం కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకోవడం.. ఆమె మరణాన్ని తట్టుకోలేక ఎస్సై కూడా ఆత్మహత్య చేసుకోవడం విషాదంగా మారింది. దివ్య ఆత్మహత్య చేసుకోవడానికి చంద్రశేఖర్ వేధింపులే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన కూడా ఆత్మహత్యకు పాల్పడటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పోలీసుల వివరాల ప్రకారం.. చంద్రశేఖర్‌కు ఇల్లందకుంట మండలం సీతంపేటకు చెందిన దివ్యతో 2016లో వివాహమైంది. వారికి ఇద్దరు కొడుకులున్నారు. కరీంనగర్‌లోని హనుమాన్‌నగర్‌లో నివసిస్తున్నారు ఈ దంపతులు. అయితే రోజు మాదిరిగానే పిల్లలను స్కూల్లో దింపిన చంద్రశేఖర్ విధులకు హాజరయ్యేందుకు పీఎస్‌కు వెళ్లారు. బందోబస్తు విధుల్లో ఉండగానే భార్య ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసి హుటాహుటిన వచ్చి ఆస్పత్రికి తరలించారు. ఆమె గన్నేరుపప్పు దంచుకుని తాగిందని… చికిత్స చేస్తుండగా మరణించిందని తెలిపారు. ఆమె తండ్రి సమ్మయ్య కూడా తమ కూతురు కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించి సీతంపేటకు తరలించి అంత్యక్రియలు చేశారు.

READ MORE: Abdul Basit: “ఆ పరిస్థితే వస్తే భారత్‌పై అణు దాడి చేస్తాం”.. పాకిస్థాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ హెచ్చరిక..

అయితే దివ్య మరణంపై గ్రామంలో ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామస్తులు. అంత్యక్రియలకు హాజరైన చంద్రశేఖర్‌‌పై దాడి జరుగుతుందనే సమాచారంతో అతన్ని ఓ ఇంట్లో దాచి అక్కడ నుంచి పోలీసులు తప్పించారనే ఆగ్రహించారు గ్రామస్తులు. దివ్య మరణం వెనక ఏం జరిగిందనే అనుమానాలు రెకెత్తాయి. అసలు గన్నేరు పప్పు ఎక్కడ లభ్యమైంది. గన్నేరుపప్పు తింటే వెంటనే చనిపోతారా..? అనేది అనుమానాలకు తావిస్తోంది. చంద్రశేఖర్ దివ్యను తీవ్రంగా కొట్టడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందనే ఆరోపణలు కూడా చేశారు బంధువులు. ఆమె ఒంటిపై గాయాలు కూడా ఉన్నాయనే టాక్ కూడా నడుస్తోంది. అయితే దివ్య తండ్రే కడుపునొప్పితో ఆత్మహత్య చేసుకుందని పిర్యాదు ఇవ్వడం వెనక ఏం జరిగిందనే ప్రశ్నలు కూడా వినిపించాయి. ఎస్సై చంద్రశేఖర్ తప్పు లేకపోతే గ్రామస్తులు ఎందుకు తరిమివేశారు. అంత్యక్రియల వద్ద ఉద్రిక్తత ఎందుకు చోటుచేసుకుంది? అనే విషయాలపై చర్చలు సాగుతుండగానే చంద్రశేఖర్‌ కూడా ఆత్మహత్య చేసుకోవడం ఆ కుటుంబంలో విషాదం నింపింది. దివ్య, చంద్రశేఖర్ ఇద్దరు కూడా ఉన్నత విద్యావంతులే. చంద్రశేఖర్ సింగరేణి కుటుంబం నుంచి.. దివ్య పేరుమోసిన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేపథ్యం ఉంది. దివ్య ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏం వచ్చింది…? ఇద్దరు పిల్లలున్నారు. తల్లిదండ్రులున్నారు… ఏదైనా సమస్య ఉంటే చర్చించుకునే అవకాశం ఉంది. క్షణికావేశంలో ఆ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు తలెత్తింది? సమాజంలో జరుగుతున్న రకరకాల కేసులను చూసిన చంద్రశేఖర్ ఇంతటి నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారు? అనేవి ఇప్పుడు మిస్టరీగా మారాయి. దివ్య ఆత్మహత్యకు కడుపునొప్పే కారణమా..? ఇంకేదైనా ఉందా…? నిజంగా చంద్రశేఖర్ వేధించారా..? ఒకవేళ ఎస్సై చంద్రశేఖర్ తన భార్యను వేధిస్తే.. ఆమె కుటుంబ సభ్యులు చంద్రశేఖర్‌ని ఎందుకు గ్రామస్తుల బారి నుంచి రక్షిస్తారు..? ఇక చంద్రశేఖర్ ఆత్మహత్యకు సూటిపోటి మాటలే కారణమా…? తన వల్లే దివ్య చనిపోయిందనే బాధ కారణమా? అనేది తేలాల్సి ఉంది..