Reading Time: 3 minutes
Nepal Floods Isro Satellite Images Glacier Collapse Trishuli River

నేపాల్‌ను కనీవినీ ఎరుగని జలప్రళయం అతలాకుతలం చేసింది. ఊహించని రీతిలో క్షణాల్లో జలప్రళయం బీభత్సం సృష్టించింది. ఇప్పటి వరకు దాదాపు 280 మంది వరకు ప్రాణాలు కోల్పోగా.. ఇంకా భారతదేశంతో పాటు చైనా సహా ప్రపంచ దేశాలకు చెందిన వందలాది మంది గల్లంతయ్యారు. ఇక జలప్రళయానికి సంబంధించిన వీడియోలు హడలెత్తిస్తున్నాయి. అమ్మో.. అంటూ గుండెలపై చేయి వేసుకుని భయాందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ముమ్మరంగా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య భారీగా పెరగవచ్చని భావిస్తున్నారు.

De

ఇక ఈ బీభత్సానికి కారణాలను ఇస్రో విశ్లేషించింది. కీలక ఆధారాలను సేకరించింది. ఎత్తైన హిమాలయ ప్రాంతంలో హిమనదం (గ్లేసియర్) కూలిపోవడం కారణమై ఉండొచ్చని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ప్రాథమిక విశ్లేషణలో వెల్లడైంది. ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించి ఈ అంచనాకు వచ్చింది. నేపాల్-టిబెట్ సరిహద్దుకు సమీపంలోని ప్రాంతంలో హిమనదం కూలిన ఆనవాళ్లతో పాటు.. ఉప్పొంగిన భోటే కోసి నది, దిగువ ప్రాంతాల్లో భారీ వరదలను ఉపగ్రహ చిత్రాలు చూపిస్తున్నాయి.

Isro

ఆగస్టు 26న తీసిన ఉపగ్రహ చిత్రాల్లో త్రిశూలి నదికి సమీపంలోని ఎత్తైన పర్వత ప్రాంతంలో భారీగా భూభాగ మార్పులు చోటుచేసుకున్నట్లు కనిపించింది. ఈ చిత్రాల్లో హిమనదం ప్రాంతంలో కూలిన ఆనవాళ్లు, నదీ ప్రవాహం విస్తరించడం, దిగువ ప్రాంతాల్లో వరద నీరు భారీగా చేరిన దృశ్యాలు నమోదయ్యాయి.

ఆగస్టు 26న ఉదయం 10.30 గంటల సమయంలో ఇస్రోకు చెందిన రిసోర్సాట్-2ఏ (Resourcesat-2A) ఉపగ్రహంలోని AWiFS సెన్సార్ ఈ చిత్రాలను సేకరించింది. ఈ చిత్రాలను ప్రమాదానికి ముందు తీసిన ఉపగ్రహ చిత్రాలతో పోల్చి పరిశీలించడం ద్వారా భూభాగం, నదీ వ్యవస్థలో వచ్చిన మార్పులను షనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) గుర్తించింది.

అసలు ఏం జరిగింది?

NRSC ప్రాథమిక అంచనా ప్రకారం.. హిమనదం, పర్వత ప్రాంతంలో మంచు-రాళ్ల భారీ కొండచరియలు లేదా హిమపాతం తరహా విరిగిపడటం ఈ విపత్తుకు కారణమై ఉండొచ్చు. ఈ ఘటనలో భారీ మొత్తంలో మంచు, రాళ్లు, ఇతర శిథిలాలు ఒక్కసారిగా దిగువకు కొట్టుకువచ్చినట్లు తెలుస్తోంది. ఈ భారీ శిథిలాల కారణంగా నది ప్రవాహానికి తాత్కాలికంగా అడ్డంకి ఏర్పడి ఉండొచ్చని NRSC భావిస్తోంది. దీంతో నీరు ఒకచోట భారీగా నిలిచిపోయి.. ఆ తర్వాత ఒక్కసారిగా విడుదల కావడంతో వరద ఉధృతి పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. నీటితో పాటు మంచు, రాళ్లు, ఇతర శిథిలాలు కూడా దిగువకు కొట్టుకురావడంతో త్రిశూలి నదీ వ్యవస్థ వెంట భారీ డెబ్రిస్ సర్జ్ ఏర్పడినట్లు తెలుస్తోంది.

మూడింట రెండు వంతుల హిమనదం కూలిందా?

NRSC ప్రాథమిక విశ్లేషణ ప్రకారం.. హిమనదంలోని దాదాపు మూడింట రెండు వంతుల భాగం విడిపోయి కూలిపోయినట్లు అంచనా. ఆగస్టు 26న తీసిన ల్యాండ్‌శాట్-9 ఉపగ్రహ చిత్రంలో ఈ ప్రాంతాన్ని ‘జోన్ ఆఫ్ గ్లేసియర్ బ్రేకేజ్ అండ్ కొలాప్స్’గా గుర్తించారు. అంతకుముందు ఆగస్టు 24న తీసిన సెంటినెల్-2 ఉపగ్రహ చిత్రంలో ఇదే ప్రాంతం హిమనదంగా కనిపించింది. అయితే ఘటన తర్వాత తీసిన చిత్రాల్లో అదే ప్రాంతం భారీ మంచు-రాళ్ల కొండచరియలు విరిగిపడిన ప్రాంతంగా కనిపించింది.

ఉప్పొంగిన భోటే కోసి నది

ప్రమాదానికి ముందు, తర్వాత తీసిన ఉపగ్రహ చిత్రాలను పరిశీలించగా.. భోటే కోసి నది వెడల్పు గణనీయంగా పెరిగినట్లు గుర్తించారు. నదీ ప్రవాహం సాధారణంగా ఉండే మార్గాన్ని దాటి పక్కనే ఉన్న లోయ ప్రాంతాల్లోకి వరద నీరు ప్రవహించినట్లు NRSC గుర్తించింది. రసువా జిల్లాలోని రసువాగఢి, టిమురే ప్రాంతాలతో పాటు నేపాల్-టిబెట్ సరిహద్దుకు సమీపంలోని ప్రాంతాలు, త్రిశూలి నదీ వ్యవస్థపై ఈ వరద ప్రభావం కనిపించింది. హిమనదం, మంచుతో కప్పబడిన పర్వత ప్రాంతం నుంచి నదీ ప్రవాహం వైపు విస్తరించిన భారీగా మారిపోయిన భూభాగం కూడా ఉపగ్రహ చిత్రాల్లో కనిపించింది.

భారీగా శిథిలాల ప్రవాహం

త్రిశూలి నదీ వ్యవస్థ వెంట ఒక్కసారిగా వచ్చిన వరదతో పాటు భారీగా రాళ్లు, మంచు, మట్టి, ఇతర శిథిలాలు కొట్టుకువచ్చినట్లు NRSC పేర్కొంది. హిమనదం లేదా మంచు-రాళ్ల కొండచరియలు కూలిపోవడంతో నదికి తాత్కాలికంగా అడ్డంకి ఏర్పడి ఉండొచ్చని.. ఆ తర్వాత నిలిచిన నీరు ఒక్కసారిగా విడుదల కావడంతో వరద ఉధృతి భారీగా పెరిగి ఉండొచ్చని అంచనా వేసింది. అయితే ప్రస్తుత ఉపగ్రహ విశ్లేషణలో వరద నీటిలో మునిగిన మొత్తం ప్రాంతం ఎంత? ఎంత పరిమాణంలో శిథిలాలు కొట్టుకువచ్చాయి? నదిలో నీటి ప్రవాహం ఎంత స్థాయిలో ఉంది? మౌలిక వసతులకు ఎంత నష్టం జరిగింది? అనే వివరాలను NRSC నిర్ధారించలేదు.

మరోవైపు.. ప్రభావిత ప్రాంతంలోని కొన్ని భాగాలు మేఘాలతో కప్పబడి ఉండటంతో ఉపగ్రహ చిత్రాల ఆధారంగా పూర్తి స్థాయి అంచనా వేయడంలో పరిమితులు ఉన్నాయని NRSC తెలిపింది. ఈ విశ్లేషణ ప్రాథమికమైనదేనని.. మరింత సమగ్ర అధ్యయనం అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, ఇస్రో, అంతరిక్ష శాఖ స్పష్టం చేశాయి.