
హైదరాబాద్ ఐదు నెలల క్రితం జరిగిన ఒక దారుణ హత్య ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెరేడ్మెట్ పరిధిలోని హెచ్బీ కాలనీలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. స్నేహితుడిని చంపి, ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని వంటింటి కిచెన్ ప్లాట్ఫాం కింద పూడ్చిపెట్టిన ఒక ప్లంబర్ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది.
సిద్ధిపేట జిల్లాకు చెందిన గవ్వల మల్లేష్, కంచి వెంకట్ ఇద్దరూ ప్లంబర్లుగా పనిచేస్తున్నారు. నిందితుడు మల్లేష్ హెచ్బీ కాలనీలో అద్దెకు ఉంటున్నాడు. గత ఏడాది డిసెంబర్ 15న వీరిద్దరూ పని కోసం లేబర్ అడ్డా వద్ద కలుసుకున్నారు. అయితే ఆ రోజు పని దొరకకపోవడంతో, ఇద్దరూ కలిసి మల్లేష్ గదికి వెళ్లి మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న సమయంలో ఇద్దరి మధ్య చిన్నపాటి వాగ్వాదం మొదలైంది. ఆ క్రమంలో వెంకట్, మల్లేష్ను తీవ్రంగా అవమానించడంతో కోపోద్రిక్తుడైన మల్లేష్ అక్కడే ఉన్న ఒక ఇనుప రాడ్తో వెంకట్ తలపై బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు వెంకట్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
హత్య తర్వాత భయాందోళనకు గురైన మల్లేష్, సాక్ష్యాలను తుడిచేయాలని పక్కా ప్లాన్ వేశాడు. మృతదేహం కాళ్లు, చేతులు, మెడను తాడుతో కట్టి, కిచెన్ ప్లాట్ఫాం కింద ఉన్న ఖాళీ ప్రదేశంలో కుక్కేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా దానిపై ఇటుకలతో ఒక గోడలా కట్టేసి, ఆ గదికి తాళం వేసి ఊరికి పరారయ్యాడు.
మల్లేష్ చాలా కాలంగా గదికి రాకపోవడం, అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యజమాని అనుమానం పెంచుకున్నాడు. మార్చి 4వ తేదీన ఆ గది నుంచి విపరీతమైన దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా, కిచెన్ ప్లాట్ఫాం కింద కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న ఎముకల అవశేషాలు బయటపడ్డాయి.
మృతుడు వెంకట్కు కుటుంబ సభ్యులతో పెద్దగా సంబంధాలు లేకపోవడం, ఎవరూ మిస్సింగ్ ఫిర్యాదు చేయకపోవడంతో ఈ కేసు పోలీసులకు సవాలుగా మారింది. అయితే నెరేడ్మెట్ పోలీసులు సాంకేతిక ఆధారాలను CCTV, కాల్ డేటా విశ్లేషించి, నిందితుడు మల్లేష్ను పట్టుకున్నారు. విచారణలో అతను చేసిన పాపాన్ని ఒప్పుకోవడంతో పోలీసులు అతడిని రిమాండ్కు తరలించారు.
ఒక చిన్న గదిలో, అది కూడా వంట చేసే కిచెన్ ప్లాట్ఫాం కిందే శవాన్ని దాచి ఐదు నెలల పాటు తప్పించుకోవడం పోలీసులను సైతం ఆశ్చర్యపరిచింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..