
Malacca Strait: ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ యుద్ధం కాస్తా.. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది.. మధ్యప్రాచ్యంలో హార్మూజ్ జలసంధి ఉద్రిక్తతల ప్రభావం ఇంకా కొనసాగుతుండగానే, ఇప్పుడు ఆసియాలోని కీలక సముద్ర మార్గమైన మలక్కా జలసంధి మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇండోనేషియా ఆర్థిక మంత్రి చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ వాణిజ్య రంగంలో కలకలం రేపాయి. మలక్కా జలసంధి గుండా ప్రయాణించే ఓడలపై సుంకాలు విధించే అవకాశాన్ని ఆయన ప్రస్తావించడంతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
మంత్రి వ్యాఖ్యలతో కలకలం
ఇండోనేషియా ఆర్థిక మంత్రి పూర్బయ యుధి సాదేవ్ ఇటీవల మాట్లాడుతూ, తమ నియంత్రణలో ఉన్న మలక్కా జలసంధి గుండా వెళ్లే నౌకలపై టోల్ విధిస్తే దేశానికి భారీ ఆదాయం లభిస్తుందని అన్నారు. ఈ వ్యాఖ్యలతో, ఇరాన్ హార్మూజ్ జలసంధిలో అనుసరిస్తున్న విధానాన్ని ఇండోనేషియా కూడా అనుసరిస్తుందా అనే చర్చ మొదలైంది. అయితే, ఈ వ్యాఖ్యలపై ప్రపంచవ్యాప్తంగా స్పందనలు రావడంతో ఇండోనేషియా ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇచ్చింది. మలక్కా జలసంధి గుండా వెళ్లే నౌకలపై ఎలాంటి రవాణా రుసుములు లేదా టోల్ విధించే ప్రణాళికలు లేవని మంత్రి ప్రకటించారు. తమ దేశం ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టాల ఒప్పందం (UNCLOS)కు కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.
హార్మూజ్ ఉద్రిక్తతల ప్రభావం
ఇటీవల హార్మూజ్ జలసంధి ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడింది. పర్షియన్ గల్ఫ్ నుంచి ప్రపంచానికి వెళ్లే చమురు సరఫరాలో సుమారు 20 శాతం ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. దీంతో చమురు ధరలు భారీగా పెరిగాయి. ఈ పరిస్థితుల్లోనే మరో కీలక సముద్ర మార్గమైన మలక్కా జలసంధి గురించిన చర్చలు మొదలవడంతో ప్రపంచ వాణిజ్య రంగం అప్రమత్తమైంది.
మలక్కా జలసంధి ఎందుకు కీలకం?
మలక్కా జలసంధి దాదాపు 900 కిలోమీటర్ల పొడవు కలిగిన సముద్ర మార్గం. ఇది తూర్పు ఆసియా, మధ్యప్రాచ్యం, యూరప్ మధ్య అతి తక్కువ దూరం కలిగిన సముద్ర రవాణా మార్గంగా భావిస్తారు. ఇండోనేషియా, మలేషియా, థాయ్లాండ్, సింగపూర్ దేశాల మధ్య ఈ జలసంధి ఉంది. ప్రపంచ చమురు రవాణాలో కూడా ఇది అత్యంత కీలక మార్గం. యూఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ దీనిని ప్రపంచంలోనే అతిపెద్ద చమురు రవాణా అవరోధ బిందువుగా పేర్కొంది.
భారీగా పెరిగిన నౌకా రాకపోకలు
మలేషియా సముద్రయాన శాఖ గణాంకాల ప్రకారం, 2025లో మలక్కా జలసంధి గుండా 1,02,500కు పైగా నౌకలు ప్రయాణించాయి. 2024లో ఈ సంఖ్య 94,300 మాత్రమే ఉండగా, ఏడాదిలోనే గణనీయంగా పెరిగింది. అయితే, హార్మూజ్ తర్వాత మలక్కా జలసంధి కూడా సమస్యాత్మకంగా మారితే ప్రపంచ వాణిజ్యం, చమురు సరఫరా, ఇంధన ధరలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఇండోనేషియా వివరణ ఇచ్చినా, ఈ అంశంపై ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి.