Reading Time: < 1 minute
Rbi Cancels Paytm Payments Bank License Impact On Customers

దేశీయ ఫిన్‌టెక్ దిగ్గజం పేటీఎంకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) గట్టి షాక్ ఇచ్చింది. నిబంధనలను పదేపదే ఉల్లంఘిస్తోందన్న కారణంతో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) బ్యాంకింగ్ లైసెన్స్‌ను ఆర్‌బీఐ అధికారికంగా రద్దు చేసింది. దీనివల్ల ఇకపై ఈ బ్యాంక్ ఎలాంటి బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహించడానికి వీలుండదు. నేటితో బ్యాంక్ కార్యకలాపాలు ముగించాలని ఆర్బీఐ పేర్కొంది.

అసలు ఏం జరిగింది..?

చాలా కాలంగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పనితీరుపై ఆర్‌బీఐ నిఘా పెట్టింది. బ్యాంకింగ్ నిబంధనలను పాటించకపోవడం, కస్టమర్ల వివరాల నమోదు (KYC)లో లోపాలు ఉండటం వంటి కారణాలతో గతంలోనే ఆర్‌బీఐ ఈ బ్యాంక్‌పై ఆంక్షలు విధించింది. కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆదేశించింది. అయితే.. ఆర్‌బీఐ సూచించిన మార్పులను చేయడంలో బ్యాంక్ విఫలమైందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కస్టమర్లపై ప్రభావం ఏంటి..?

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాల్లో ఉన్న నగదును కస్టమర్లు ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు. కానీ.. కొత్తగా డబ్బులు డిపాజిట్ చేయడానికి అనుమతి ఉండదు. మీ పేటీఎం వాలెట్ లేదా ఫాస్టాగ్‌లో ఇప్పటికే ఉన్న బ్యాలెన్స్‌ను మీరు వాడుకోవచ్చు. అయితే, లైసెన్స్ రద్దు నేపథ్యంలో వీటిని రీఛార్జ్ చేయడం సాధ్యం కాదు.

సాధారణ పేటీఎం యాప్ (UPI సేవలు) యథావిధిగా పనిచేస్తుంది. ఎందుకంటే యూపీఐ సేవలను ఇతర బ్యాంకుల సహకారంతో పేటీఎం అందిస్తోంది. కేవలం ‘పేమెంట్స్ బ్యాంక్’ సేవలు మాత్రమే నిలిచిపోతాయి. బ్యాంకింగ్ రంగంలో పారదర్శకత, కస్టమర్ల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ఆర్‌బీఐ ఈ నిర్ణయం ద్వారా మరోసారి స్పష్టం చేసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లు తమ ఖాతాలోని నగదును వేరే బ్యాంకులకు మార్చుకోవడానికి అవకాశం ఉంది.