Reading Time: < 1 minute
Microsoft Rule Of 70 Self Retirement Plan Ai Impact On Jobs

Microsoft’s ‘Rule of 70’: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఉద్యోగాలపై నీలినీడలు ముసురుకుంటున్న వేళ, టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర కంపెనీలలాగా ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగించకుండా, వారికి గౌరవప్రదమైన రీతిలో ‘సెల్ఫ్ రిటైర్మెంట్’ ఆఫర్‌ను ప్రకటించింది. ఏఐ రాకతో పని భారం తగ్గడం, ఉత్పాదకత పెరగడంతో మానవ వనరుల అవసరం తగ్గుతోందని భావిస్తున్న మైక్రోసాఫ్ట్, అమెరికాలోని తన సిబ్బందిలో దాదాపు 7 శాతం మందికి స్వచ్ఛంద విరమణ అవకాశం కల్పిస్తోంది. సుమారు 9,000 మంది ఉద్యోగులకు ఈ ఆఫర్ వర్తించనుంది.

ఏమిటీ ‘రూల్ ఆఫ్ 70’..
మైక్రోసాఫ్ట్ ఈ రిటైర్మెంట్ ప్లాన్ కోసం ఒక ప్రత్యేకమైన ఫార్ములాను రూపొందించింది. దీనినే “రూల్ ఆఫ్ 70” అని పిలుస్తున్నారు. దీని ప్రకారం.. ఒక ఉద్యోగి వయస్సు, ఆ కంపెనీలో వారు పనిచేసిన సంవత్సరాల మొత్తం 70 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, వారు ఈ సెల్ఫ్ రిటైర్మెంట్ ఆఫర్‌ను ఎంచుకోవచ్చు. ఉదాహరణకు ఒక ఉద్యోగి వయస్సు 50 ఏళ్లు ఉండి, మైక్రోసాఫ్ట్‌లో 20 ఏళ్ల సర్వీస్ ఉంటే (50+20=70), వారు ఈ స్కీమ్‌కు అర్హులు. సీనియర్ డైరెక్టర్ స్థాయి, అంతకంటే తక్కువ కేడర్ ఉద్యోగులకు ఈ అవకాశం కల్పించారు.

జీతాల పెంపు, బోనస్ నిబంధనల్లోనూ మార్పులు
కేవలం రిటైర్మెంట్ మాత్రమే కాకుండా, కంపెనీ అంతర్గత రివార్డుల వ్యవస్థలో కూడా భారీ మార్పులు చేసింది మైక్రోసాఫ్ట్. ప్రస్తుతం ఉన్న 9 శాలరీ లెవల్స్‌ను 5కి తగ్గించింది. అలాగే ఉద్యోగుల పనితీరును ఒకరితో ఒకరు పోల్చి చూసే పాత పద్ధతిని తొలగించింది. స్టాక్ రివార్డులను, క్యాష్ బోనస్‌లను వేరు చేసింది. దీనివల్ల మేనేజ్‌మెంట్‌కు వార్షిక వేతనాల చెల్లింపులో మరింత వెసులుబాటు లభిస్తుంది. గత కొద్ది కాలంగా మైక్రోసాఫ్ట్ తన పూర్తి దృష్టిని ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్ల విస్తరణపై పెట్టింది. ఆస్ట్రేలియాలో 18 బిలియన్ డాలర్లు, జపాన్‌లో 10 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడులను ప్రకటించింది. ఏఐ పవర్ పెరగడం వల్ల తక్కువ మంది ఉద్యోగులతోనే ఎక్కువ పని సాధ్యమవుతుందని కంపెనీ భావిస్తోంది. అందుకే పెట్టుబడి భారానికి తగ్గట్టుగా ఖర్చులను నియంత్రించేందుకు ఈ ‘గౌరవప్రదమైన’ మార్గాన్ని ఎంచుకుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.