తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. ఇళ్లు, వాహనాలు ఉన్నప్పటికీ అర్హులమని ఫేక్ పత్రాలు చూపించి లబ్ధి పొందే ప్రయత్నాలు పెరగడంతో.. ప్రభుత్వం గ్రామస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి, ఏఐ సాంకేతికతను ఉపయోగించడం ప్రారంభించింది.
ఇందులో భాగంగానే ప్రభుత్వం తొలుత కామారెడ్డి జిల్లాలో ఏఐ స్క్రీనింగ్ నిర్వహించి తొలుత 675 మంది దరఖాస్తు దాలరులను అనర్హులుగా గుర్తించింది. వీరందిరి వివరాలు సేకరించి మరోసారి అధికారులతో పరిశీలన జరిపించింది. అయితే 675 మందితో 428 మంది అసలు అర్హులే కాదని తేలింది.
ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు జిల్లాలో 12,021 ఇళ్లు మంజూరు కాగా, వాటిలో చాలా వరకు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే గతంలోనే ఇళ్లు పొందినవారు సైతం మళ్లీ ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నట్టు అధికారులు గుర్తించారు.
అలాగే వాహనాలు లేదా పాత ఇళ్లు పేర్లపై ఉండటంతో కొందరిని ఏఐ అనర్హులుగా గుర్తిస్తోంది. అయితే, తమపై వచ్చిన ఆరోపణలను కొందరు లబ్ధిదారులు ఖండిస్తున్నారు. తాము నిజంగానే పేదవాళ్లమేనని.. జీవనోపాధి కోసం వాహనాలు వాడుతున్నాం అని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో గ్రౌండ్ రియాలిటీని పరిగణలోకి తీసుకుని అధికారులు నివేదికలను రాష్ట్ర స్థాయికి పంపిస్తూ నిజమైన అర్హులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.




