
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం కేవలం ఐదేళ్లకే పరిమితం కాదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇది మరో 30 ఏళ్ల పాటు కొనసాగినా ఆశ్చర్యం లేదని బీజేపీ నేత పి.వి.ఎన్. మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. TV9 క్రాస్ ఫైర్లో జగన్ మోహన్ రెడ్డి అరెస్ట్, కేంద్రం వైఖరి, రాష్ట్ర అభివృద్ధిపై నెలకొన్న పలు సందేహాలకు తనదైన శైలిలో సమాధానాలిచ్చారు. జగన్ మోహన్ రెడ్డి తన హయాంలో చేసిన తప్పులకు జైలుకు వెళ్లాల్సిందేనని మాధవ్ స్పష్టం చేశారు. ‘‘జగన్ను బీజేపీ కాపాడుతోందన్న ఆరోపణల్లో వాస్తవం లేదు. ప్రస్తుతం లిక్కర్ స్కామ్ వంటి కేసుల్లో విచారణ దశలవారీగా సాగుతోంది. ఇప్పటికే కొందరు దొరికారు, ప్రధాన సూత్రధారిని గుర్తించే పనిలో దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. పక్కా ఆధారాలు లభించినప్పుడు చట్టపరమైన చర్యలు తప్పవు. అరెస్ట్ అనేది కేవలం సమయంతో కూడుకున్న పని మాత్రమే” అని ఆయన వివరించారు.
కూటమి భవిష్యత్తు – బీజేపీ బలోపేతం
పవన్ కళ్యాణ్ ఆకాంక్షిస్తున్నట్లుగా కూటమి ప్రభుత్వం 15 ఏళ్లు కాదు, 30 ఏళ్లు కొనసాగినా రాష్ట్రానికి మేలే జరుగుతుందని మాధవ్ అభిప్రాయపడ్డారు. ‘‘అరాచక పాలన మళ్లీ రాకూడదన్నదే మా లక్ష్యం. ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజల ఆశీర్వాదం పొందాలని ప్రధాని మోదీ కూడా సూచించారు’’ అని వెల్లడించారు. అదే సమయంలో ఏపీలో బీజేపీ ఎదుగుదలపై కూడా ఆయన స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో 90శాతం మంది న్యూట్రల్ ఓటర్లు ఉన్నారని, ప్రతి బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం ద్వారా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటుతుందని మాధవ్ ధీమా వ్యక్తం చేశారు.