Reading Time: < 1 minute
Puri Jagannadh Faces Backlash Pokiri Re Release Cancelled Over Liger Losses

పూరీ జగన్నాథ్‌ చుట్టూ ఇప్పుడు వివాదాలు ముదురుతున్నాయి. ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన ఆయన, ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ల ఆగ్రహానికి గురవుతున్నారు. ‘లైగర్’ సినిమా మిగిల్చిన నష్టాల సెగ, తాజాగా మహేష్ బాబు ‘పోకిరి’ రీ-రిలీజ్‌ను అడ్డుకోవడమే కాకుండా.. పూరీ కెరీర్‌కే ఒక పెద్ద సవాల్‌గా మారింది. మే నెలలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కోసం ప్లాన్ చేసిన ‘పోకిరి’ రీ-రిలీజ్ హఠాత్తుగా రద్దయ్యింది, దీనికి కారణం సాంకేతిక సమస్యలు కావు.. కేవలం పూరీ జగన్నాథ్‌పై ఉన్న కోపం. ‘లైగర్’ వల్ల భారీగా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు, పూరీకి సంబంధించిన ఏ సినిమాను థియేటర్లలోకి రానివ్వమని తెగేసి చెప్పారు. ఫలితంగా ‘పోకిరి’ స్థానంలో మహేష్ బాబు మరో చిత్రం ‘అతిథి’ని విడుదల చేయాలని నిర్ణయించారు.

Also Read : Dhurandhar 2: ఒక్క రికార్డ్ కూడా మిగిలేలా లేదు.. పుష్ప రికార్డ్ బ్రేక్, నెక్స్ట్ బాహుబలి!

‘లైగర్’ నష్టాలను భర్తీ చేస్తానని గతంలోనే పూరీ డిస్ట్రిబ్యూటర్లకు మాట ఇచ్చారు, ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా విడుదల తర్వాత బకాయిలు చెల్లిస్తానని హామీ ఇచ్చినా, ఇప్పటికీ ఆ దిశగా ఎలాంటి అడుగులు పడలేదు, దీనితో విసిగిపోయిన బాధితులు ఇప్పుడు ప్రత్యక్ష పోరాటానికి దిగారు. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్ నేతృత్వంలోని బృందం పూరీపై కఠిన నిర్ణయం తీసుకుంది. తమకు రావాల్సిన బకాయిలు సెటిల్ చేసే వరకు పూరీ జగన్నాథ్‌కు సంబంధించిన ఏ సినిమాను (పాతవి లేదా కొత్తవి) థియేటర్లలో ప్రదర్శించకూడదని నిర్ణయించారు. డిస్ట్రిబ్యూటర్ల యూనియన్ ఇంత గట్టిగా నిర్ణయం తీసుకోవడం టాలీవుడ్‌లో కలకలం రేపుతోంది, ఒకవేళ పూరీ జగన్నాథ్ వెంటనే స్పందించి బకాయిలు చెల్లించకపోతే, ఆయన రాబోయే ప్రాజెక్టులకు పెద్ద చిక్కులు తప్పవని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.