Reading Time: 2 minutes
Cricket Controversies : ఫిక్సింగ్ భూతం నుంచి బోర్డులతో గొడవల వరకు.. కెరీర్ నాశనం చేసుకున్న ఆటగాళ్లు వీరే

Cricket Controversies : క్రికెట్ ప్రపంచంలో కొందరు ఆటగాళ్లు తమ అద్భుతమైన టాలెంటుతో శిఖరాలను అధిరోహిస్తారు. కానీ, మరికొందరు మాత్రం ఆ ప్రతిభను కాపాడుకోలేక, మైదానం బయట చేసే పనుల వల్ల లేదా క్రమశిక్షణారాహిత్యం వల్ల తమ అద్భుతమైన కెరీర్‌ను మధ్యలోనే నాశనం చేసుకుంటారు. మ్యాచ్ ఫిక్సింగ్, సెలక్టర్లతో గొడవలు, బోర్డుతో విభేదాలు ఇలా రకరకాల కారణాలతో తమ అంతర్జాతీయ క్రికెట్ జీవితాన్ని తలకిందులు చేసుకున్న ఐదుగురు ప్రముఖ క్రికెటర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

1. మహమ్మద్ అమీర్

పాకిస్థాన్ స్పీడ్ స్టార్ మహమ్మద్ అమీర్ ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను వణికించాడు. అయితే 2010లో లార్డ్స్ టెస్టులో కావాలని నో బాల్స్ వేసి స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు. దీనివల్ల జైలు శిక్షతో పాటు ఐదేళ్ల నిషేధం ఎదుర్కొన్నాడు. నిషేధం తర్వాత జట్టులోకి వచ్చినప్పటికీ, అప్పటి కోచ్‌లు, పీసీబీ మేనేజ్మెంట్‌తో అతనికి అస్సలు పడేది కాదు. మానసిక వేధింపులకు గురవుతున్నానని ఆరోపిస్తూ చాలా చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

2. ఎస్. శ్రీశాంత్

భారత జట్టు 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ గెలవడంలో శ్రీశాంత్ పాత్ర మరువలేనిది. కానీ, 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం అతని జీవితాన్ని మార్చేసింది. ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయడం, బీసీసీఐ జీవితకాల నిషేధం విధించడంతో అతని కెరీర్ ఒక్కసారిగా ఆగిపోయింది. ఏళ్ల తర్వాత కోర్టు ద్వారా క్లీన్ చిట్ వచ్చి, నిషేధం తొలగించబడినప్పటికీ, అప్పటికే అతని వయస్సు మించిపోయింది.

3. కెవిన్ పీటర్సన్

ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలో అత్యంత టాలెంటెడ్ బ్యాటర్లలో పీటర్సన్ ఒకడు. అయితే, అతని నోటి దురుసు, మొండితనం అతనికి శాపంగా మారాయి. 2012లో సౌతాఫ్రికా సిరీస్ సమయంలో తన సొంత కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ గురించి ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు అవమానకరమైన మెసేజ్‌లు పంపి దొరికిపోయాడు. ఆ తర్వాత కోచ్ పీటర్ మూర్స్ తో గొడవలు, బోర్డుతో విభేదాల కారణంగా 2014లో అతన్ని జట్టు నుంచి శాశ్వతంగా తప్పించారు.

4. అంబటి రాయుడు

భారత బ్యాటర్ అంబటి రాయుడు టాలెంట్ ఉన్నా వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు. 2019 వన్డే వరల్డ్ కప్ జట్టులో అతనికి చోటు దక్కలేదు. అప్పుడు సెలక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్ విజయ్ శంకర్ ఒక త్రీ-డీ ప్లేయర్ అని వ్యాఖ్యానించారు. దీనిపై రాయుడు ఆగ్రహంతో వరల్డ్ కప్ చూడటానికి త్రీ-డీ గ్లాసెస్ ఆర్డర్ చేశాను అని ట్వీట్ చేశాడు. ఈ వ్యంగ్య వ్యాఖ్యలు బోర్డుకు కోపం తెప్పించాయి. ఆ మనస్తాపంతోనే రాయుడు హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు.

5. ఆండ్రూ సైమండ్స్

ఆస్ట్రేలియా దిగ్గజ ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్ కెరీర్ ఎప్పుడూ వివాదాలతోనే సాగింది. భారత్ తో మంకీ గేట్ వివాదం ఒకెత్తయితే, అతని వ్యక్తిగత క్రమశిక్షణ లేకపోవడం మరో ఎత్తు. టీమ్ మీటింగ్స్‌కు రాకపోవడం, తాగి ప్రాక్టీస్ సెషన్లకు రావడం వంటి పనులతో బోర్డు ఆగ్రహానికి గురయ్యాడు. 2009 టీ20 వరల్డ్ కప్‌కు ముందు క్రమశిక్షణ కారణాలతో అతన్ని ఇంటికి పంపించేశారు. ఆ తర్వాత అతను మళ్ళీ ఆస్ట్రేలియా జర్సీ ధరించలేకపోయాడు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..