Reading Time: < 1 minute
Israel Decided To Kill Ayatollah Ali Khamenei In November Defence Minister

అయతుల్లా అలీ ఖమేనీ. ఇరాన్ సుప్రీం లీడర్. అత్యున్నతమైన హోదాలో ఉన్న నాయకుడు. ప్రపంచంలో గుర్తింపు ఉన్న నేత. అలాంటి నాయకుడిని ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా అంతమొందించాయి. ఈ ఘటన ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఎంతో కట్టుదిట్టమైన భద్రతలో ఉన్న ఒక నాయకుడిని గుట్టుచప్పుడు లేకుండా లేపేయడంతో ప్రపంచమంతా కలవరానికి గురి చేసింది. తాజాగా మర్డర్ వెనుక మిస్టరీ వెలుగులోకి వచ్చింది.

ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు. 90 రోజుల క్రితమే ఖమేనీని చంపేయాలని ప్రణాళిక రచించినట్లుగా తెలిపారు. 2025 నవంబర్‌లో అంతమొందించాలని ప్లాన్ చేసినట్లుగా చెప్పారు. కానీ అప్పుడు కుదరలేదని.. జనవరిలోనైనా అమలు చేయాలనుకున్నామని.. అంతలోనే ఇరాన్‌లో అల్లర్లు మొదలయ్యాయని.. ఈ గందరగోళం మధ్య ప్లాన్ వాయిదా వేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది మధ్యలో ప్లాన్ అమలు చేయాలని ఆలోచన చేస్తుండగా ఫిబ్రవరి 28న అత్యవసరంగా ప్లాన్ అమలు చేయాల్సి వచ్చిందని వివరించారు.

ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో జరిగిన చాలా చిన్న, రహస్యమైన సమావేశంలో అత్యంత వేగంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఫిబ్రవరి చివరిలో అమెరికాతో కలిసి మొదటి గంటల్లోనే ఖమేనీని అంతమొందించినట్లుగా చెప్పారు. ఖమేనీని చంపేయడమే తమ లక్ష్యమని నెతన్యాహు స్పష్టంగా చెప్పారని పేర్కొన్నారు.

ఇరాన్ అణు కార్యక్రమం, బాలిస్టి్క్ క్షిపణులు ఇజ్రాయెల్ ఉనికికి ముప్పు కలిగిస్తాయని ఇజ్రాయెల్ భావించిందని.. అందుకే ఖమేనీని చంపడమే తమ ముందన్న లక్ష్యంగా పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌ను పూర్తిగా నాశనం చేయగల ఆయుధాలను ఇరాన్ అభివృద్ధి చేసిందని.. అందుకే దాని మూలల నుంచే తొలగించాలని భావించినట్లుగా చెప్పారు.

ఇరాన్‌లో పాలన మార్పును ఇజ్రాయెల్ కోరుకుంటోందని.. ప్రస్తుత ప్రభుత్వం కూలిపోవాలన్నారు. కొత్తగా శాంతియుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇరాన్ ఎన్నుకునే నాయకుడు.. ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకుంటాడని.. ఇజ్రాయెల్‌ను నాశనం చేసే ఏ నాయకుడిని సహించబోమని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఇరాన్‌ ఇంకా అధికారాన్ని వదులుకోలేదని.. పైగా ఎదురుదాడికి దిగుతోందన్నారు. దీంతో చమురు సరఫరాలకు అంతరాయం కలిగిస్తున్నాయని చెప్పారు. యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలు కూడా భయపడుతున్నాయన్నారు. ఇరాన్ ముప్పు తొలగిపోయే వరకు దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ స్పష్టం చేశారు.