Reading Time: 2 minutes

ఆ కుటుంబంలో 200 ఏళ్ల తర్వాత ఆడ బిడ్డ పుట్టింది.. ఆ పాప ఎంతటి అదృష్టవంతురాలంటే..

Caption of Image.

ఆడ పిల్ల పుడితే.. ‘‘మా ఇంటి మహా లక్ష్మి’’ పుట్టిందని సంతోషించే తల్లిదండ్రులు ఉన్నారు. ఆడ పిల్ల పుట్టిందని నిట్టూర్చే కుటుంబాలు కూడా ఈరోజుల్లో చాలానే ఉన్నాయి. 2026లో కూడా అమ్మాయి పుట్టిందని అసంతృప్తులతో వేదన చెందే మనుషులు ఉన్నారని, మనస్తత్వాలు ఉన్నాయని చెప్పడానికి ఎలాంటి సందేహం అక్కర్లేదు. కానీ.. ఈ కుటుంబం మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. తమ కుటుంబంలో ఐదు తరాల తర్వాత ఆడ బిడ్డ పుట్టింది. 200 ఏళ్ల తర్వాత తమ కుటుంబంలోకి లక్ష్మీ దేవి అడుగుపెట్టిందని ఈ కుటుంబం సంబురం చేసుకుంది. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన దహిఫాలే కుటుంబం ఆడబిడ్డ పుట్టడాన్ని పండుగలా జరుపుకుంది.

తమ నిరీక్షణ ఫలించిందని.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన నవజాత శిశువుకు, ఆమె తల్లికి స్వాగతం పలుకుతూ గుర్రాల రథంలో ఊరేగించింది. పూలతో రథాన్ని అలంకరించింది. డప్పులు, తాళాలు వాయిస్తూ తల్లిని, బిడ్డను ఊరేగింపుగా ఇంటికి తీసుకువెళ్లారు. కుటుంబ సభ్యులు నవజాత శిశువును ఒక యువ రాణిలా ఇంటికి తీసుకెళ్లారు. అలాంటి ఇంట్లో పుట్టిన ఈ ఆడ బిడ్డ ఎంతటి అదృష్టవంతురాలోనని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. గార్గి అని పుట్టిన పాపకు పేరు పెట్టుకున్నారు. సుమారు 200 సంవత్సరాలుగా దహిఫాలే కుటుంబంలో ఆడపిల్ల పుట్టలేదు.

►ALSO READ | ఆర్మీ చేతిలో అయోధ్య రాముడు.. ట్రస్ట్ తొలి సీఈవో జితేంద్ర మిశ్రా బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే..

మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా, అహ్మద్‌పూర్ తాలూకాలోని కొల్వాడి గ్రామానికి చెందిన గార్గి తాత లింబాజీ దహిఫాలే, పాప పుట్టడంతో భావోద్వేగానికి లోనయ్యారు. తమ కుటుంబంలోకి ఆడ బిడ్డ అడుగుపెట్టడం గొప్ప అదృష్టమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తన కూతురిని ఒక పువ్వులా చూసుకుంటామని గార్గి తండ్రి చెప్పారు. ఆడ బిడ్డ పుట్టిందని ఆవేదన చెందే కుటుంబాలు ఉన్న ఈరోజుల్లో ఇలా ఒక కుటుంబం ఆడ బిడ్డ పుట్టడాన్ని సంబురంలా జరుపుకోవడం హర్షించదగిన పరిణామం.

©️ VIL Media Pvt Ltd.