Reading Time: 2 minutes
Rains: తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్.. ఈ ప్రాంతాల ప్రజలకు హెచ్చరిక

తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ వర్షసూచన జారీ చేసింది. ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో చెదురుమదురు వానలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో పడే ఛాన్స్ ఉందని తెలిపింది. రాష్ట్రంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు 28 సెంట్రిగేడ్ డిగ్రీల నుంచి 30 డిగ్రీల మధ్య ఉండే అవకాశం ఉండగా.. రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు 22 డిగ్రీల సెల్సియస్ నుంచి 23 డిగ్రీల వరకు ఉండే అవకాశముంది.

ఏపీ, తెలంగాణకు వర్షసూచన

ఏపీకి కూడా వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. ఉపరితల గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కురిసే అవకాశముందని స్పష్టం చేసింది. కోస్తాంధ్ర, రాయలసీమలో సెప్టెంబర్ 3 నుంచి 5వ తేదీ వరకు వానలు కరిసే ఛాన్స్ ఉంది. ఈశాన్య మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలలో ఉన్న తీవ్ర అల్పపీడనం కొనసాగుతోన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి దిశగా వెళుతుంది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా దక్షిణ ఉత్తర ప్రదేశ్, ఉత్తర మధ్యప్రదేశ్ మీదుగా కదిలే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు. దీనికి తోడు మరో రుతుపవన ద్రోణి మధ్యప్రదేశ్ నుంచి తూర్పు-మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది. తీవ్ర అల్పపీడనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో రాబోయే కొన్ని రోజుల పాటు వానలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. సెప్టెంబర్ 3,4వ తేదీల్లో బంగాళాఖాతంలో మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని వాతావరణశాఖ హెచ్చరించింది. సెప్టెంబర్ 3న తెలంగాణలోని ఉత్తర, దక్షిణ తెలంగాణలో వాతావరణంలో తేమ ఎక్కువగా కనిపిస్తోంది. దీని ప్రభావంతో చల్లని వాతావరణం ఉంటుందని, పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది.

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. పలుచోట్ల ఈదురుగాలులు బలంగా వీస్తున్నాయి. వర్షాల పడే సమయంలో వేగంగా గాలులు వీస్తాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ తెలిపింది. వర్షాలు పడే సమయంలో విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్ వద్ద ఉండవద్దని హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే ఛాన్స్ ఉందని, ప్రజలు  జాగ్రత్తగా ఉండాలని సూచించింది.