Reading Time: 2 minutes
Mukesh Ambani Launches %e2%82%b910 Ice Cream Brand Bombay Creamery

Mukesh Ambani: వ్యాపారం అంటే.. అంబానీయే.. ఏ మార్కెట్‌లో అడుగు పెట్టినా.. ఓ కుదుపు కుదిపేస్తుంటారు.. ఏ రంగంలో అడుగు పెట్టినా.. తన మార్క్‌ను చాటుకున్న ముఖేష్‌ అంబానీ.. ఇప్పుడు కొత్త మార్కెట్‌పై కన్నేశారు.. భారతదేశంలో అత్యంత ధనవంతులైన వ్యాపారవేత్తల్లో ఒకరైన ముఖేష్ అంబానీ తక్కువ ధరల విభాగంలో తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి, సాధారణ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని కేవలం రూ.10కే లభించే ఆహార, పానీయ ఉత్పత్తులపై రిలయన్స్ దృష్టి సారిస్తోంది. ఈ వ్యూహంలో భాగంగా ఇప్పుడు రూ.10 ధరతో ఐస్‌క్రీమ్ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది.

రూ.10కే బాంబే క్రీమరీ ఐస్‌క్రీమ్
రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ‘బాంబే క్రీమరీ’ పేరుతో కొత్త ఐస్‌క్రీమ్ బ్రాండ్‌ను ప్రారంభించింది. ప్రారంభ దశలో ఈ బ్రాండ్ పశ్చిమ భారతదేశంలో అందుబాటులోకి రానుంది. అనంతరం దేశవ్యాప్తంగా విస్తరించేందుకు రిలయన్స్ ప్రణాళికలు రూపొందిస్తోంది. దీని ద్వారా అముల్, మదర్ డెయిరీ, వాదిలాల్, క్వాలిటీ వాల్స్ వంటి ఇప్పటికే బలంగా ఉన్న బ్రాండ్లకు రిలయన్స్ పోటీ ఇవ్వనుంది.

రూ.10 వ్యూహం ఇదే తొలిసారి కాదు
ముఖేష్ అంబానీ రూ.10 ధర విభాగంలో ప్రయోగాలు చేయడం ఇదే మొదటిసారి కాదు. క్యాంపా బ్రాండ్‌ను పునఃప్రారంభించిన సమయంలో రిలయన్స్ రూ.10కే శీతల్ జల్ పేరుతో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అదే సమయంలో కోకా-కోలా, పెప్సికో ఆధిపత్యం ఉన్న శీతల పానీయాల మార్కెట్‌లో క్యాంపా కోలా 200 మిల్లీలీటర్ల బాటిల్‌ను రూ.10కే అందుబాటులోకి తెచ్చింది. ఈ తక్కువ ధర వ్యూహం క్యాంపాకు మార్కెట్‌లో వేగంగా విస్తరించేందుకు సహాయపడినట్లు రిలయన్స్ తెలిపింది. ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, FY2026లో క్యాంపా రూ.4,700 కోట్లకు పైగా నికర అమ్మకాలు సాధించింది. కీలక మార్కెట్లలో రెండంకెల మార్కెట్ వాటాతో దేశంలో నాల్గవ అతిపెద్ద కార్బొనేటెడ్ సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్‌గా క్యాంపా ఎదిగినట్లు రిలయన్స్ పేర్కొంది.

కోలా నుంచి నిత్యావసరాల వరకు
రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కేవలం శీతల పానీయాలు, నీరు, ఐస్‌క్రీమ్‌తోనే పరిమితం కాకుండా విస్తృత FMCG విభాగంలోకి అడుగుపెట్టింది. ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, వంట నూనెలు, పప్పులు, ధాన్యాలు, ప్యాకేజ్డ్ ఫుడ్, ఇతర గృహావసర ఉత్పత్తులను కూడా కంపెనీ విక్రయిస్తోంది. రిలయన్స్ వినియోగదారుల వ్యాపారంలో ‘ఇండిపెండెన్స్’ బ్రాండ్ కీలకంగా మారింది. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, FY2026లో ఈ బ్రాండ్ సుమారు రూ.2,600 కోట్ల అమ్మకాలను సాధించింది. అలాగే ‘క్యాంపస్యూర్’ ద్వారా ప్యాకేజ్డ్ వాటర్ విభాగంలోనూ రిలయన్స్ తన ఉనికిని మరింత విస్తరిస్తోంది.

మధ్యతరగతి మార్కెట్‌పై ఫోకస్
రోజువారీ జీవితంలో చిన్న మొత్తాలతో తరచుగా కొనుగోలు చేసే ఉత్పత్తుల మార్కెట్‌లో భారీ వినియోగదారుల ఆధారం ఉంది. ఈ నేపథ్యంలో రూ.10 ధరను కీలకంగా చేసుకుని రిలయన్స్ కొత్త ఉత్పత్తులను తీసుకురావడం వ్యాపార విస్తరణలో భాగంగా కనిపిస్తోంది. నీరు, శీతల పానీయాల తర్వాత ఇప్పుడు ఐస్‌క్రీమ్‌తో కూడా ఈ విభాగంలోకి ప్రవేశించడం ద్వారా దేశంలోని భారీ FMCG వినియోగదారుల మార్కెట్‌పై రిలయన్స్ మరింత దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మొత్తంగా.. ఏ మార్కెట్‌ను వదిలిపెట్టేది లేదు అనే తరహాలో.. అంబానీ.. అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు.