Reading Time: 2 minutes
Supreme Court Neet Ug Paper Leak Nta Reforms Report

Supreme Court: దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్-యుజీ (NEET-UG) పేపర్ లీకేజీ వ్యవహారంపై దేశ అత్యున్నత నాయస్థానం సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, జాతీయ పరీక్షల సంస్థ (NTAలకు అత్యున్నత కోర్టు అత్యంత కీలక ఆదేశాలు జారీ చేసింది. తాత్కాలిక చిట్కాలతో సరిపెట్టకుండా, వ్యవస్థాగతంగా ఎలాంటి శాశ్వత సంస్కరణలు చేపడుతున్నారో సమగ్రంగా వివరిస్తూ నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అలోక్ ఆరాధేలతో కూడిన ధర్మాసనం ఈ కీలక విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు స్పందిస్తూ.. పరీక్షల నిర్వహణలో ఎదురవుతున్న లోపాలను సరిదిద్దడానికి కేవలం తాత్కాలిక చర్యలు మాత్రమే సరిపోవని, శాశ్వత పరిష్కారాల వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ప్రశ్నపత్రాల రవాణాకు వైమానిక దళాన్ని వినియోగించడం వంటివి తాత్కాలికంగా ఉపయోగపడే మార్గాలు మాత్రమేనని జస్టిస్ నరసింహ పేర్కొన్నారు. భవిష్యత్తులో విద్యార్థుల ఫ్యూచర్‌తో చెలగాటం ఆడకుండా ఉండేందుకు ప్రతిపాదించిన గవర్నింగ్ బోర్డు, నిపుణుల బృందాలు, హైపవర్డ్ కమిటీ ఇచ్చిన సిఫార్సులను ఏ విధంగా అమలు చేస్తున్నారో నివేదిక ఇవ్వాలని కోర్టు కోరింది. ప్రత్యేకించి డిజిటల్ మౌలిక వసతులు, భద్రత, పారదర్శకత, పరిశోధన, పరిపాలన, మానవ వనరులు సహా మొత్తం 10 కీలక విభాగాల్లో సాధించిన పురోగతి వివరాలను అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని NTAని ఆదేశించింది.

దీంతో పాటు, పరీక్షల సెక్యూరిటీ, పర్యవేక్షణ, విజిలెన్స్ కోసం ప్రత్యేకంగా నియమించిన అదనపు డైరెక్టర్ జనరల్ పాత్ర, ఆయన పనితీరుపై కూడా నివేదిక కోరింది. పరీక్ష జరగడానికి ముందు, పరీక్ష జరుగుతున్నప్పుడు, పరీక్ష పూర్తయిన తర్వాత.. ఇలా ప్రతి దశలోనూ తీసుకుంటున్న రక్షణ చర్యలపై స్టేటస్ రిపోర్ట్ అందించాలని ఆదేశించింది. పరీక్షా కేంద్రాల ఎంపిక, ప్రశ్నపత్రాల ముద్రణ నుంచి వాటి రవాణా వరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లపై స్పష్టత ఇవ్వాలని కోరింది. మరోవైపు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానానికి మారడం, విద్యార్థుల సమాచార రక్షణ (డేటా ప్రొటెక్షన్), అభ్యర్థుల గుర్తింపు ధృవీకరణ కోసం ‘డిజియాత్ర’ వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగించే అంశాలపై కేంద్రం ప్రతిపాదనలు సవివరంగా చెప్పాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రస్తుతం దాఖలైన అఫిడవిట్‌లో ఈ వివరాలేవీ స్పష్టంగా లేవని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేయగా.. కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ, ఈ అంశాలన్నింటినీ చేర్చుతూ త్వరలోనే కొత్తగా సమగ్ర అఫిడవిట్ దాఖలు చేస్తామని కోర్టుకు విన్నవించారు. కేవలం నివేదికలు తీసుకోవడమే కాకుండా, ఈ సంస్కరణల అమలు తీరును ఏడాది పొడవునా తాము నిశితంగా పరిశీలిస్తూనే ఉంటామని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా తేల్చిచెప్పింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.