Reading Time: < 1 minute
రైలు కిందపడి తహసీల్దార్ ఆత్మహత్య.. APలో ప్రభుత్వ అధికారి మృతి కలకలం!

చిత్తూరు, జులై 24: గురువారం (జులై 24) సాయంత్రం సుమారు 6.30 గంటల సమయంలో తమిళనాడులోని కాట్పాడి నుంచి చిత్తూరు వైపు వస్తున్న మెము ఎక్స్‌ప్రెస్‌ సిద్ధంపల్లె వద్దకు చేరుకుంటుండగా శ్రీనివాసులు పట్టాలపైకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. సమాచారం అందుకున్న జీఆర్‌పీ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

శ్రీనివాసులు 2024 ఎన్నికల సమయంలో రామాపురం తహసీల్దార్‌గా పనిచేశారు. ఎన్నికల అనంతరం ఆయనను లక్కిరెడ్డిపల్లెకు బదిలీ చేశారు. అనంతరం పీజీఆర్‌ఎస్‌కు సంబంధించిన ఒక ఫిర్యాదు నేపథ్యంలో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఆ విచారణలో భాగంగా సంబంధిత మండలానికి చెందిన వీఆర్‌వో వెంకటరమణను సస్పెండ్ చేయగా, శ్రీనివాసులును కలెక్టరేట్‌లోని కేఆర్‌ఆర్‌సీ (కోనేరు రంగారావు రిఫార్మ్స్ కమిటీ) విభాగానికి బదిలీ చేశారు. జిల్లా కేంద్రం మదనపల్లెకు మారిన తర్వాత ఆయన పీజీఆర్‌ఎస్‌ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ఆయనపై వచ్చిన ఆరోపణలపై ఉన్నతాధికారులు మరోసారి విచారణ నిర్వహించి, కొన్ని తప్పులు జరిగినట్లు భావించి సంబంధిత నివేదికను సీసీఎల్‌ఏ (Chief Commissioner of Land Administration)కు పంపినట్లు సమాచారం.

కొంతకాలంగా శ్రీనివాసులు అనారోగ్యంతో బాధపడుతూ సెలవులో ఉన్నారని తెలిసింది. చికిత్స పొందుతున్న సమయంలోనే ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఆయన భార్య అన్నమయ్య జిల్లాలోని సదుం మండల ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె కూడా ఇటీవల అనారోగ్య కారణాలతో సెలవులో ఉన్నట్లు సమాచారం. శ్రీనివాసులుకు భార్య, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తె ఉన్నత విద్య కోసం అమెరికాలో చదువుకుంటుండగా.. కుమారుడు పదో తరగతి చదువుతున్నాడు. శ్రీనివాసులు మృతితో కుటుంబంలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన జీఆర్‌పీ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు విచారణ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.