జనరిక్ మందులపై 200 శాతం టారిఫ్ విధించిన ట్రంప్.. మందులు పిరం అయితయా..?

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. విదేశాల నుంచి దిగుమతి అయ్యే జనరిక్ మందులపై ఏకంగా 200 శాతం వరకు టారిఫ్ను విధించనున్నట్టు వెల్లడించారు. అమెరికాలోనే ఫార్మా ఉత్పత్తుల తయారీని పెంచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.
బుధవారం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ట్రూత్’ వేదికగా ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. టారిఫ్లను 3 దఫాలుగా అమలు చేస్తామని తెలిపారు. ‘‘2026 ఆగస్టు 1 నుంచి తొలి రెండేండ్లు అమెరికాలోకి దిగుమతి అయ్యే జనరిక్ ఔషధాలపై జీరో శాతం సుంకం కొనసాగుతుంది. మూడో ఏడాది (2028) నుంచి 100 శాతానికి పెంచుతాం.
నాలుగో ఏడాది (2029) నుంచి టారిఫ్ ఏకంగా 200 శాతానికి చేరుకుంటుంది” అని వెల్లడించారు. అమెరికాలోనే జనరిక్ ఔషధాల తయారీని పునరుద్ధరించడమే లక్ష్యమని, నిర్ణీత గడువులోగా దేశంలో ప్లాంట్లు, ప్లాంట్ పరికరాలు ఏర్పాటు చేయని కంపెనీలపై ఈ జరిమానా వర్తిస్తుందని తెలిపారు. ఈ విధానం వల్ల దేశ ప్రజల ఆరోగ్యం, ప్రయోజనాలకు రక్షణ లభిస్తుందని అన్నారు. అదే సమయంలో పేటెంట్, బ్రాండెడ్ లేదా ఇన్నోవేటివ్ ఔషధాల విధానంలో ఎలాంటి మార్పు ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.
భారత ఫార్మా రంగానికి సవాలుగా మారనుందా ?
జనరిక్ డ్రగ్స్పై సుంకాల పెంపు నిర్ణయం ప్రపంచంలోనే అతిపెద్ద జనరిక్ మందుల ఎగుమతిదారుగా ఉన్న భారత్పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికాకు అవసరమయ్యే జనరిక్ మందుల్లో సుమారు 40 శాతం భారత్ సరఫరా చేస్తోంది. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (జీటీఆర్ఐ) నివేదిక ప్రకారం.. భారత్ నుంచి అమెరికాకు ఏటా సుమారు 9.7 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.80 వేల కోట్లు) విలువైన మందులు ఎగుమతి అవుతున్నాయి.
ఇది భారత్ మొత్తం ఫార్మా ఎగుమతుల్లో 38 శాతానికి సమానం. బీపీ, షుగర్, క్యాన్సర్, మానసిక అనారోగ్యాలు, ఇన్ఫెక్షన్ల నివారణకు వాడే అనేక జనరిక్ మందులు భారత్ నుంచే వెళ్తున్నాయి. అమెరికాలో వాడే గర్భ నిరోధక మాత్రల్లో దాదాపు 65 శాతం స్థానాన్ని భారతీయ కంపెనీలైన గ్లెన్మార్క్, లుపిన్లే భర్తీ చేస్తున్నాయి. దీంతో ట్రంప్ సుంకాల ప్రభావం భారత్ ఫార్మా రంగానికి సవాలేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
నౌకలపై కాల్పులు జరిపితే ఇరాన్లో బ్రిడ్జిలు పేల్చేస్తం..
హార్మూజ్ జలసంధిలో నౌకలపై ఇరాన్ దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ ప్రయోగించేది క్షిపణి, రాకెట్ లేదా డ్రోన్ ఏదైనా సరే.. దాడి జరిగిన ప్రతిసారీ టెహ్రాన్ సమీపంలో లేదా నగరంలో ఉన్న ఒక బ్రిడ్జి లేదా విద్యుత్ ప్లాంట్ను అమెరికా బాంబులతో ధ్వంసం చేస్తుందని వార్నింగ్ఇచ్చారు.
ఈ మేరకు బుధవారం ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘ఇప్పటి నుంచి హార్మూజ్ జలసంధి గుండా వెళ్లే ఏ ఒక్క నౌకపైనా ఇరాన్ దాడి చేసినా.. ఆ దేశ రాజధాని లేదా దాని పరిసరాల్లోని ఒక బ్రిడ్జిని కానీ, పవర్ ప్లాంట్ను కానీ యునైటెడ్ స్టేట్స్ పూర్తిగా ధ్వంసం చేస్తుంది’ అని పేర్కొన్నారు.
ఇరాన్పై అమెరికా మరోసారి దాడులు జరిపిన తర్వాత అమెరికా అధ్యక్షుడి నుంచి ఈ హెచ్చరిక వచ్చింది. ఈ దాడులలో టెహ్రాన్పై వైమానిక రక్షణ వ్యవస్థలు కాల్పులు జరిపాయి. ఇరాన్పై అమెరికా వరుసగా 11వ సారి వైమానిక దాడులు నిర్వహించింది.
ఇజ్రాయెల్ సరిహద్దుల్లోని జోర్డాన్ నగరంపై ఇరాన్ క్షిపణి దాడి చేసింది. బహ్రెయిన్, సౌదీ అరేబియాకు కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి మూతపడటంతో ఇరు దేశాల మధ్య వివాదం మరింత ముదిరింది.