July 19, 2026

CM Revanth Reddy : కల్తీ ఆహారానికి చెక్.. హోటల్ యజమానులపై ఇక క్రిమినల్ కేసులు.!

CM Revanth Reddy : కల్తీ ఆహారానికి చెక్.. హోటల్ యజమానులపై ఇక క్రిమినల్ కేసులు.!
Reading Time: 2 minutes
Telangana Food Adulteration Law Criminal Cases

CM Revanth Reddy : రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్న ఆహార, ఔషధ కల్తీల నిరోధానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత కఠినమైన చట్టాన్ని తీసుకురాబోతోంది. మార్కెట్‌లో కూరగాయలు, పండ్లు, పాలు వంటి నిత్యావసరాలు విచ్చలవిడిగా కల్తీ బారిన పడుతుండటంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపాదిత ‘తెలంగాణ ఆహార కల్తీ, ఔషధ నియంత్రణ చట్టం’ (TGFADCA) పై శనివారం ఎంసీహెచ్‌ఆర్‌డీ (MCHRD) లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో కలిసి ఒక సమగ్ర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆకుకూరలు, కూరగాయలు, పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు, పండ్లను త్వరగా మగ్గబెట్టేందుకు విచ్చలవిడిగా రసాయనాలు వాడుతుండటంతో ప్రజలు క్యాన్సర్ల వంటి భయంకరమైన రోగాల బారిన పడుతున్నారని సీఎం ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.

విదేశీ విధానాలపై అధ్యయనం.. అసెంబ్లీలో సమగ్ర చర్చ

రసాయనాలు, ఎరువుల అతిగా వాడకం వల్ల పంట ఉత్పత్తులలో ప్రమాదకర అవశేషాలు బయటపడుతున్నాయని, దీంతో మన ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడానికి విదేశాలు సైతం నిరాకరిస్తున్న విషయాన్ని సీఎం ప్రస్తావించారు. మార్కెట్‌లో ఆర్గానిక్ ఉత్పత్తుల పేరుతో అధిక ధరలకు అమ్ముతున్నా, అవి అసలైనవేనా అని నిర్ధారించే సరైన వ్యవస్థలు ప్రస్తుతం లేవన్నారు. ఈ నేపథ్యంలో, కల్తీల నిరోధానికి ప్రపంచంలోనే అత్యుత్తమ చట్టాలు ఉన్న దేశాల విధానాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి రావాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆ నివేదికల ఆధారంగా ఒక బలమైన బిల్లును తయారు చేసి, ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించడంతో పాటు శాసనసభలో దీనిపై సమగ్రమైన చర్చ చేపడతామని సీఎం స్పష్టం చేశారు.

విజిల్ బ్లోయర్లు, టోల్ ఫ్రీ నెంబర్.. క్యూర్ పరిధిలో పైలట్ ప్రాజెక్ట్

కల్తీ రాయుళ్ల గుట్టురట్టు చేసేందుకు వీలుగా సమాచార సేకరణ కోసం ఒక ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేయాలని, క్షేత్రస్థాయిలో ‘విజిల్ బ్లోయర్ల’ను నియమించాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. కల్తీ నిరోధక నిబంధనలను కఠినంగా అమలు చేసే క్రమంలో.. తొలి విడతగా ‘క్యూర్’ (CURE) ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అక్కడ ఈ కొత్త నిబంధనలను అమలు చేసి, అందులో ఎదురయ్యే లోటుపాట్లను సరిదిద్దుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా చట్టాన్ని విస్తరించాలని సూచించారు. కల్తీ ఆహార తయారీదారులపై క్రిమినల్‌ కేసుల దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించిరు సీఎం రేవంత్. ఈ కీలక సమీక్షా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సి.వి. ఆనంద్, సీఎం సలహాదారు కె. రామకృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రటరీలు వి. శేషాద్రి, ఎన్. శ్రీధర్ సహా పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.