July 15, 2026

Off The Record : కాకినాడ ఎంపీ పనితీరుపై జనసేనలోనే అసహనం!

Off The Record : కాకినాడ ఎంపీ పనితీరుపై జనసేనలోనే అసహనం!
Reading Time: 2 minutes
Off The Record Over Janasena 13

సొంత పార్టీ అధ్యక్షుడి నియోజకవర్గాన్ని కూడా ఆ ఎంపీ ప్రొటెక్ట్ చేయలేకపోతున్నారా? నమ్మి నానబోసుకుంటే…పుచ్చి బుర్రట్లాడినయ్‌ అన్న సామెతను గుర్తు చేస్తున్నారా? పదవి ఉంది, ప్రోటోకాల్ ఉంది. పోయి కో ఆర్డినేట్ చేయమంటే… కనీస పెర్ఫార్మెన్స్‌ కూడా ఇవ్వలేకపోతున్నారా? పేరుకే యంగ్‌గానీ…. ఆయనకి అస్సలు పని చేయాలన్న మూడ్‌, ఉత్సాహం ఏమీ లేవా? మరీ… దారుణంగా ఉన్నారని జనసైనికులే మాట్లాడుకుంటున్న ఆ ఎంపీ ఎవరు? ఎందుకలా చేస్తున్నారు?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురం. ఆయనకి ఉన్న బాధ్యతలు, ఇతరత్రా వ్యవహారాల దృష్ట్యా నియోజకవర్గానికి తరచూ వచ్చే అవకాశం ఉండదు. అలాగని నమ్మి గెలిపించిన ఓటర్లను పట్టించుకోలేదన్న అపవాదు రాకూడదు. అందుకే పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం బాధ్యతల్ని స్థానికంగా కొందరు నేతలకు అప్పగించారు పవన్‌. అందులో అతి ముఖ్యమైన వ్యక్తి కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్‌ శ్రీనివాస్‌. మిగతా వాళ్ళు సాధారణ జనసేన నాయకులేగానీ…ఉదయ్‌ శ్రీనివాస్‌కు మాత్రం ఎంపీగా ప్రోటోకాల్‌ ఉంటుంది. ఎక్కడైనా పనుల విషయంలో తేడా జరిగినా… అధికారులు అలసత్వం ప్రదర్శించినా జోక్యం చేసుకుని తగిన ఆదేశాలు ఇచ్చే వీలుంది. కానీ… ఉదయ్‌ శ్రీనివాస్‌ మాత్రం అసలా సంగతే పట్టించుకోవడం లేదన్నది జనసైనికుల ప్రధాన విమర్శ. పైగా… నియోజకవర్గంలో టీడీపీ- జనసేన మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రెండు పార్టీల నాయకులు కలిసి ఒకే వేదిక పంచుకోవడానికి కూడా ఆసక్తి చూపడం లేదు.

ఈ విషయంలో కూడా ఎంపీ తనకేం పట్టనట్టు ఉంటున్నారట. సమన్వయం చేయాల్సిన నేత ఎందుకలా ఉంటున్నారన్నది కేడర్‌ క్వశ్చన్‌. పిఠాపురంలో టీడీపీ నేత వర్మకి జనసేన కేడర్‌కు మధ్య చాలా గ్యాప్ ఉంది. దాంతో నియోజకవర్గంలో తరచు ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంది. ఆ విషయంలో స్వయంగా సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని స్పష్టత ఇవ్వాల్సి వచ్చింది. కానీ… బాధ్యత ఉండి, లోకల్‌ ఎంపీ అయిన ఉదయ్ శ్రీనివాస్ మాత్రం పిఠాపురం సంగతిని అస్సలు పట్టించుకోవడం లేదని జనసైనికులే పెదవి విరుస్తున్నారు. ప్రోటోకాల్ పదవి ఉంది కాబట్టి పవన్ తరుపున ఆయన బాధ్యతలు తీసుకుంటారని అనుకుంటే… అసలు ఆ ఊసే ఎత్తడం లేదట. నియోజకవర్గంలో పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను పర్యవేక్షించడానికి జనసేన ఫైవ్ మెన్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో కూడా సభ్యుడిగా ఉన్నారు ఎంపీ.

అయినా సరే స్పందనలు ఉండటం లేదట. మామూలుగా అయితే ఎంపీకి పిఠాపురం బాధ్యతలు అప్పగించేస్తారని మొదట్లో ప్రచారం జరిగింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొన్నాళ్లు అంతా తానై చేశారు కూడా. కానీ… ఎంపీ అయ్యాక ఆయన పనితీరు అంతంత మాత్రంగా ఉండడంతో ఉన్నా లేకున్నా ఒక్కటే అన్నట్టుగా మారింది వ్యవహారం. కనీసం వర్మ జనసేనను డిఫెన్స్‌లో పడేస్తున్నప్పుడైనా స్పందించాలి కదా అంటూ నిలదీస్తున్నారు గ్లాస్‌ కార్యకర్తలు. నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ తర్వాత ప్రస్తుతం ఎంపీకి మాత్రమే ప్రోటోకాల్ ఉంది. కానీ… ఆయన మాత్రం దాన్ని వాడ్డంలేదని అంటున్నారు. టీడీపీ, జనసేన నేతల మధ్య సమన్వయం చేసి… పద్ధతిగా మొత్తాన్ని సెట్‌ చేయడానికి కావాల్సినంత అధికారం, అవకాశం ఉన్నా… ఉదయ్ శ్రీనివాస్ మాత్రం పెద్దగా ఆసక్తి చూపడం లేదని చెప్పుకుంటున్నారు స్థానికంగా. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్‌ ఉన్నాయి. ఇందులో ఐదుగురు టీడీపీ, ఇద్దరు జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగతా ఆరు చోట్ల ఎవరి నియోజకవర్గంలో వాళ్లే పెత్తనం చేసుకుంటారు.

 

పిఠాపురంలో ఖాళీ ఉన్నప్పుడు ఎంపీ లీడ్ తీసుకుంటే ఏమైందంటూ ప్రశ్నిస్తున్నారు లోకల్ లీడర్స్‌. ఇక్కడి నాయకులు ఎప్పుడు అడిగినా…. కలుద్దామన్నా, నేను అవుట్ ఆఫ్ స్టేషన్ అన్నదే సమాధానం అంటూ చర్చించుకుంటున్నారు. కనీసం ఒక్కసారి కూడా కలిసేంత టైం లేకుండా ఎంపీకి అంత బిజీ ఏమిటీ…..? అదే నిజమైతే ఆ వ్యాపారాలేవో చేసుకోవచ్చుకదా….? అలాంటి వాళ్లకు రాజకీయం ఎందుకంటూ ఘాటుగా రియాక్ట్‌ అవుతోంది పిఠాపురం జనసేన ద్వితీయ శ్రేణి. పార్లమెంట్ సమావేశాలు లేనప్పుడైనా నియోజకవర్గంలో ఉండాలి కదా, అందులోనూ పిఠాపురంను ప్రత్యేకంగా చూడాలి కదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఉదయ్‌ శ్రీనివాస్‌ మాత్రం ఎవడేమనుకుంటే నాకేంటి…. నాకు మాత్రం అంత టైం లేదని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నట్టు సమాచారం. దాంతో… ఎక్కడా లేని, ఎవ్వరికీ లేని బిజీ మా ఎంపీకేనంటూ సెటైర్లు వేసే వాళ్ళు పెరుగుతున్నారు. గతంలో చాలా ఎంపీ ఉంది ఎంపీలను చూశాంగానీ…. నియోజకవర్గంలో తిరగడానికి కూడా టైంలేనంత బిజీ పర్సన్‌ని ఫస్ట్‌టైం చూస్తున్నాం, ఇదో కొత్త ట్రెండ్, ఇలాగే ఉంటే రేపు మాకు మాత్రం టైం రాకపోతుందా అని జనసేన కింది స్థాయి నాయకులే అంటున్నారట. మొత్తానికి పిఠాపురంలో టిడిపి జనసేన మధ్య తరచూ ఏవో గిల్లికజ్జాలు బయటపడుతున్నాయి. అడ్వాన్స్ అయి లీడ్ తీసుకోవాల్సింది పోయి… అది నా పని కాదన్నట్టు ఎంపీ ఉంటున్నారు. కనీసం బాస్ నియోజకవర్గాన్ని అయినా పట్టించుకోండి సార్ అంటే వినిపించుకోవడం లేదట. దీని పర్యవసానాలు రాబోయే రోజుల్లో ఎలా ఉంటాయో చూడాలి.