Reading Time: 2 minutes
దేశంలోనే ఫస్ట్.. ఒడిశా గడ్డపై సెమీకండక్టర్ ప్లాంట్.. శంకుస్థాపన చేసిన సీఎం, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్..

భారతదేశాన్ని గ్లోబల్ సెమీకండక్టర్ హబ్‌గా మార్చాలన్న లక్ష్యంలో భాగంగా ఒడిశా రాష్ట్రం ఒక భారీ మైలురాయిని అధిగమించింది. భువనేశ్వర్‌లోని ఇన్ఫో వ్యాలీలో దేశంలోనే మొట్టమొదటి అధునాతన 3D చిప్ ప్యాకేజింగ్ యూనిట్‌‌కు సీఎం మోహన్ చరణ్ మాఝీ, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ శంకుస్థాపన చేశారు. ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు బలం చేకూరుస్తూ, అత్యాధునిక ఎలక్ట్రానిక్స్ తయారీలో ఒడిశాను ప్రపంచ గమ్యస్థానంగా నిలబెట్టే దిశగా ఈ ప్రాజెక్ట్ ఒక కీలక అడుగు. అమెరికాకు చెందిన 3D గ్లాస్ సొల్యూషన్స్ సంస్థ తన అనుబంధ సంస్థ హెటెరోజీనియస్ ఇంటిగ్రేషన్ ప్యాకేజింగ్ సొల్యూషన్స్ ద్వారా ఈ ప్లాంట్‌ను నిర్మిస్తోంది.

ఒకే చోట అత్యాధునిక సాంకేతికత

ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు రూ.1,943.53 కోట్లు వెచ్చిస్తున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం నుండి రూ.799 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం నుండి రూ.399.5 కోట్లు ఖర్చు చేస్తున్నాయి.
ఆర్థిక సహాయం లభించింది. ఏటా 70,000 గ్లాస్ ప్యానెళ్లు, 5 కోట్ల అసెంబుల్డ్ యూనిట్లు, 13,000 అధునాతన 3DHI మాడ్యూళ్లను ఇక్కడ తయారు చేయనున్నారు. ఈ ప్లాంట్ ద్వారా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, ఐటిఐ, డిప్లొమా విద్యార్థులకు వేల సంఖ్యలో ఉన్నత స్థాయి సాంకేతిక ఉద్యోగాలు లభించనున్నాయి. ఆగస్టు 2028 నాటికి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించి, 2030 నాటికి పూర్తి స్థాయి భారీ ఉత్పత్తిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

సీఎం మాఝీ మాట్లాడుతూ.. ‘‘ఇంటెల్, లాక్‌హీడ్ మార్టిన్ వంటి ప్రపంచ స్థాయి దిగ్గజాలు ఉపయోగించే అత్యాధునిక సాంకేతికత ఇప్పుడు ఒడిశా సొంతం కావడం గర్వకారణం. ఏఐ, రక్షణ రంగం, టెలికమ్యూనికేషన్ రంగాల్లో ఒడిశా ఉత్పత్తులు కీలక పాత్ర పోషిస్తాయి’’ అని ఆకాంక్షించారు. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. ‘‘గత 12 ఏళ్లలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి ఆరు రెట్లు పెరిగింది. భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ తయారీదారు. ఒడిశా ఇప్పుడు ఖనిజాల రాష్ట్రం నుండి సాంకేతిక రాష్ట్రంగా మారుతోంది’’ అని అన్నారు. ఇంటెల్ వంటి మరిన్ని అంతర్జాతీయ సంస్థలతో చర్చలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు.

రైల్వే అభివృద్ధిపై కూడా ప్రత్యేక దృష్టి

ఇదే వేదికపై ఒడిశా రైల్వే మౌలిక సదుపాయాల గురించి వైష్ణవ్ కీలక విషయాలు వెల్లడించారు. రాష్ట్రంలో రూ.90,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు నడుస్తున్నాయని, అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 59 స్టేషన్లను పునరాభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని 30 జిల్లాలకు రైల్వే అనుసంధానం కల్పించడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.